షుగర్,బిపిలపై నా సవాల్కు...ఎవరూ ముందుకు రాలేదేం?: వీరమాచనేని రామకృష్ణ
కర్నూలు:తాను చాలా సభల్లో, టీవీ కార్యక్రమాల్లో షుగర్, బీపీ వ్యాధులు కావని నిరూపిస్తానని సవాలు విసిరినా, స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాలేదని కీటో డైట్ ట్రయినర్ వీరమాచనేని రామకృష్ణారావు చెప్పారు.
టైప్ 2 షుగర్ను మందులు వాడకుండా, కేవలం ఆహార అలవాట్ల ద్వారా పూర్తిగా దూరంగా పెట్టే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఆదివారం కర్నూలు ఔట్డోర్ స్టేడియంలో స్థూలకాయం, మధుమేహం, బీపీ, థైరాయిడ్ తదితర అంశాలపై ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్యవక్తగా వీరమాచనేని రామకృష్ణారావు హాజరై ఆహార నియంత్రణ గురించి మాట్లాడారు.
ఆహారంతో ఆరోగ్యం...ఇలా
నేటి ఆధునిక జీవనంలో ప్రకృతిపరంగా లభించే ఆహారానికి మానవుడు దూరమయ్యాడని, ఆహార పద్ధతులను తిరిగి శాస్త్రీయ పద్ధతిల్లోకి మార్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని వీరమాచనేని రామకృష్ణారావు చెప్పారు. ఆహార మార్పుల వల్లే ప్రధానంగా మధుమేహం వస్తుందని, నిజానికి షుగర్ అనేది వ్యాధి కాదని పేర్కొన్నారు. శరీరానికి కార్బోహైడ్రేడ్లు, ప్రొటీన్లు, ఫ్యాట్లు అవసరమని, కానీ కేవలం శరీరానికి కార్బోహైడ్రేడ్లు మాత్రమే ఇస్తూ చక్కెర నిలువలను శరీరంలో పెంచేసుకోవడం జరుగుతోందని చెప్పారు.
కీటో డైట్...ఎప్పటి నుంచో ఉంది
శరీరానికి ప్రొటీన్లు, ఫ్యాట్లు ఇవ్వడం ద్వారా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని, తాను చెబుతున్న డైట్ విధానం కూడా ఇదేనన్నారు. ఈ డైట్ విధానం కొత్తగా తాను పరిశోధించి కనుగొన్నది కాదని, పూర్వకాలంలో ఇదే డైట్ విధానం అమల్లో ఉండేదని ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలోని ఫుడ్, మెడిసిన్, ఫార్మసీ సంస్థలు వాస్తవాలను కప్పిపెట్టి, ప్రజల నుంచి కోట్లాది రూపాయలను దోపిడీ చేస్తున్నాయని పేర్కొన్నారు. వంటింటిలోనే వైద్యశాస్త్రం ఉందన్న విషయాన్ని మహిళలు గుర్తుంచుకోవాలని వీరమాచినేని సూచించారు. మహిళలతోనే ఆరోగ్యకర సమాజం ఆవిష్కృతమవుతుందని అన్నారు. కార్పొహైడ్రేడ్లు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలని , నెయ్యి, మీడగ వినియోగించడం వల్ల ఎలాంటి హృద్రోగాలు రావని తెలిపారు. బరువు తగ్గేందుకు, బీపీ, షుగర్ నియంత్రణకు ఉపయోగపడే ఫుడ్ ప్రోగ్రామింగ్ను ఆయన వివరించారు.
షుగర్,బిపిలపై...సవాలు
తాను చాలా సభల్లో, టీవీ కార్యక్రమాల్లో షుగర్, బీపీ వ్యాధులు కావని నిరూపిస్తానని సవాలు విసిరినా, స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. టైప్ 2 షుగర్ను మందులు వాడకుండా, కేవలం ఆహార అలవాట్ల ద్వారా పూర్తిగా దూరంగా పెట్టే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కార్బోహైడ్రేట్ల ద్వారా శరీరంలోకి వెళ్లే ఆహారం ఇన్సులిన్ ద్వారా సెల్స్కు వెళుతుందని, దానికి ప్రత్యామ్నాయంగా ఫ్యాట్లు, ప్రొటీన్లు మాత్రమే ఆహారంలో చేర్చి, ఇన్సులిన్ను నిరోధకత పెంచి బీసీ, షుగర్, థైరాయిడ్ ఇతర వ్యాధులను పూర్తిగా నిరోధించవచ్చని వివరించారు. శరీరంలోని సెల్స్కు ఫ్యాట్లు, ప్రొటీన్ల ద్వారా ఇచ్చే ఆహారం ఇన్సులిన్తో సంబంధం లేకుండా నేరుగా చేరుతుందని ఈ విధానంతోనే షుగర్, బీపీతోపాటు అనేక జబ్బులకు చెక్పెట్టవచ్చని చెప్పా రు. చాలా మంది వైద్యులు షుగర్ ఉందని తేలితే వెంటనే వారిని మందులకు బానిసలుగా మార్చేసి, మరణించే వరకు మందులపై జీవించేలా చేస్తున్నారని ఆరోపించారు.
వంట నూనెల్లో...మోసం తెలుసుకోండి
ఇంట్లో నిత్యం వినియోగించే కొవ్వులేని ఫిల్డర్డ్, డబుల్ ఫిల్టర్డ్ సన్ ఫ్లవర్ ఆయిళ్లు మార్కెట్లో లీటరు రూ.90లకు దొరుకుతున్నాయని, అదే సన్ఫ్లవర్ గింజలు రైతులు కిలో రూ.300 అమ్ముతున్నారని తెలిపారు. కిలో గింజలతో పావుకిలో నూనె మాత్రమే తయారవుతుందని, రూ.1200లకు లీటరు నూనె ఉత్పత్తి కావాల్సి ఉండగా, వ్యాపారులు లీటరు నూనెకు రూ. 90కి ఎలా విక్రయిస్తున్నారని ప్రశ్నించారు. కేవలం రూ.20తో తయారవుతున్న సన్ఫ్లవర్ ఆయిల్స్ను ఉపయోగించడం వల్ల మహిళల్లో థైరాయిడ్ సమస్య పెరిగిందని చెప్పారు. అలాగే సముద్రపు ఉప్పునకబదులుగా అయోడైజ్డ్ ఉప్పు వాడకం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నామని గుర్తించాలన్నారు.