ఎవరు ఏం చేయలేరు: బాబు, బాబుకు జంపింగ్ ట్విస్ట్
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు రాష్టాలుగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలు అంతా ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు టీడీపీని ఎవరు ఏమీ చేయలేరన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన తొలి సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం మాట్లాడారు.
సేవా కార్యక్రమాలకు టీడీపీ మారుపేరు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒక్కటే అన్నారు. టీడీపీతో పెట్టుకున్న వారు అందరు దెబ్బతిన్నారన్నారు. పార్టీ నుండి ఒక్కరు పోతే వంద మందిని తయారు చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రెండేళ్లకోసారి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామన్నారు. కార్యకర్తలను సమర్థ నాయకులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. దేశంలో వినూత్న పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పారు. కార్యకర్తలు చనిపోతే వారి పిల్లలను చదివించే బాధ్యత తీసుకున్నామన్నారు.

తెలంగాణలో టీడీపీ పునాదులు చాలా గట్టివన్నారు. దేశంలో ఏ పార్టీకి కూడా లేని విధంగా నిబద్ధత కలిగిన కార్యకర్తలు టీడీపీకి ఉన్నారన్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి వారంతా పార్టీ శ్రేయస్సు కోసం పని చేస్తున్నారన్నారు.
త్వరలో చంద్రబాబుకు కొత్త కాన్వాయ్
చంద్రబాబు కాన్వాయ్ మారబోతోంది. గత కొన్నేళ్లుగా ఆయన ఉపయోగిస్తున్న పాత కాన్వాయ్ను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. కొత్త కాన్వాయ్ వాహనాల కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
రేపు బెంగళూరుకు చంద్రబాబు
చంద్రబాబు నాయుడు మంగళవారం బెంగళూరుకు వెళ్లనున్నారు. బెంగళూరులో నిర్వహించే ఐటీ ఉద్యోగుల రోడ్డు షోలో చంద్రబాబు పాల్గొంటారు.
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్సీల ట్విస్ట్
తెరాసలో చేరిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్సీలు తమ పైన అనర్హత వేటు పడకుండా ఉండేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా తాము తెరాసలో విలీనం అవుతున్నట్లు లేఖ ఇవ్వనున్నారు. తెలంగాణలో టీడీపీకి ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. అందులో ఐదుగురు తెరాసలో చేరారు. మెజార్టీ సభ్యులు కలిసి తెరాసలో విలీనం అవుతున్నట్లుగా లేఖ ఇచ్చి అనర్హత వేటు నుండి తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications