జగన్ పార్టీలో ఎవరూ మిగలరా?: 9సార్లు బెదిరించారు.. ఊరుకోవాలా: లోకేష్, రాజ్యసభకు వెళ్లను
అనంతపురం/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చకనే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. వైసిపిలో చివరకు మిగిలేది జగన్ మాత్రమేనని విమర్శించారు.
సమ్మక్క సారక్క జాతర గురించి కేంద్రానికి చంద్రబాబు లేఖ
తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో పలు అంశాల పైన చర్చించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన చర్చించారు. ఏపీకి కేటాయింపులు ఆశించిన మేర లేవని కేబినెట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇసుకను ఉచితంగా ఇవ్వాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయం పట్ల మంత్రులు ప్రశంసలు కురిపించారు. సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు.
విశ్వవిద్యాలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
విశ్వవిద్యాలయాలు పవిత్రమైనవని వాటిని ఉన్నంతంగా తీర్చిదిద్దాలని ఏపీలోని వర్సిటీల వైస్ ఛాన్సెలర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఏపీ సీఎంవోలో యూనివర్సిటీల వీసీలతో సమావేశమైన సందర్భంగా ఆయన సూచనలు చేశారు.
విద్యార్థులకు భవిష్యత్ దిశానిర్దేశం చేసేలా విశ్వవిద్యాలయాల స్పూర్తినివ్వాలన్నారు. గతంలో విశ్వవిద్యాలయాలకు ఉన్న చెడ్డ పేరును తొలగించుకుని సరికొత్తగా పయనం ప్రారంభించాలన్నారు. నదుల అనుసంధానం, జలవనరుల పెంపకం వంటి అంశాలపై బహిరంగ చర్చలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల ఆలోచనా పరిధిని పెంచాలన్నారు. నిర్మాణాత్మక నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో యూనివర్సిటీలు ప్రధాన పాత్ర పోషించాలన్నారు.
జగన్ 9సార్లు హెచ్చరించారు: లోకేష్
వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి 9సార్లు ప్రభుత్వాన్ని పడగొడతానని బెదిరించారని, మేం చూస్తూ ఊరుకోవాలా అని టిడిపి యువనేత నారా లోకేష్ అన్నారు. తనకు రాజ్యసభకు వెళ్లాలని లేదని, రాష్ట్రంలోనే పని చేస్తానని చెప్పారు. పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు అధిష్టానం నిర్ణయమని చెప్పారు