నెలాఖర్లోగా జగన్పార్టీ ఖాళీ: యనమల, 25లోగానే: డికె
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ప్రజస్వామికవాది కాదని నియంతృత్వవాది అన్నారు.
అధికారం కోసం తనను నమ్ముకున్న వారిని బలి చేయడం జగన్కు బాగా అలవాటని ఆరోపించారు. జగన్ పార్టీ ఇన్ గేట్ మూత పడిందని, ఔట్ గేట్ తెరుచుకుంటోందని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీ నాటకాలు చూస్తుంటేనే వారు విభజనకు సహకరిస్తున్నారనే విషయం అర్థమవుతోందన్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగా జగన్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు.
అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును రాష్ట్రపతి పార్లమెంటుకు పంపించవద్దని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విజ్ఞప్తి చేశారు. జివోఎంలో అందరు ఆంధ్రప్రదేశ్ను ద్వేషించే వారే ఉన్నారని ఆరోపించారు. అసెంబ్లీలో తీర్మానం లేకుండా ఏ రాష్ట్ర విభజన ఇప్పటి వరకు జరగలేదని చెప్పారు.
ఫిబ్రవరి 25లోగా తెలంగాణ: డికె అరుణ
ఫిబ్రవరి 25వ తేదీలోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని మంత్రి డికె అరుణ అన్నారు. బిల్లుపై అభిప్రాయానికి, ముఖ్యమంత్రి తీర్మానానికి సంబంధం లేదన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన తాము ఢిల్లీకి వెళ్లి జివోఎం సభ్యులను కలుస్తామని చెప్పారు.
భద్రాచలం కలపొద్దు: పొంగులేటి
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే కారణంతో భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలపొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి, ఎమ్మెల్యేలు కాంతారావు, మిత్రసేన, ఎమ్మెల్సీ పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లుపై ముఖ్యమంత్రి తిరస్కార తీర్మానం ఆమోదం పొందినా వచ్చిన నష్టమేదీ లేదన్నారు.
తెలంగాణ ప్రక్రియ ఎవరి ఆమోదాలు, తిరస్కారాలతో సంబంధం లేకుండా జరిగిపోతుందని అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలను కోరేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులంతా ఢిల్లీ వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నమూనాను మారిస్తే ముంపు గ్రామాలు తగ్గుతాయని తెలంగాణ నేతలు సూచిస్తున్నారు.