తెరాస ప్రభుత్వం వల్లే వివాదం, ఛాయిస్ లేదు: రావెల
హైదరాబాద్: ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన తాము వివాదం సృష్టించలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే 1956 స్థానికత అంటూ సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ సోమవారం అన్నారు. సాటి తెలుగు వారిని, 58 ఏళ్ల పాటు కలిసి ఉన్న తెలుగు వారిని, సంపద సృష్టించిన వారిని పరాయివాళ్లు అనడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సరికాదన్నారు. తమకు మేం సృష్టించిన సంపద ఇవ్వకపోయినా పరవాలేదని, కొంత వడ్డీ ఇస్తే (విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్) చాలన్నారు.
చట్టాలను ఎవరు కూడా తమకు అనుగుణంగా మార్చుకోవడానికి వీల్లేదన్నారు. సుప్రీం ఆదేశాలను కాదనే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఈ దేశంలోనిదే అన్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం పని చేయాల్సిందేనని చెప్పారు. ఎవరికి వారు స్థానికత పైన సొంత చట్టాలు ఎలా తెస్తారని ప్రశ్నించారు.
తమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో 58 శాతం భరించేందుకు ముందుకు వచ్చారని, తెలంగాణ రాష్ట్రం కూడా మిగతా 42 శాతం భరించేందుకు ముందుకు రావాలన్నారు. చంద్రబాబు పెద్ద మనసుతో ఓ అడుగు ముందుకేశారన్నారు. తనకు ఇద్దరు పిల్లలని, వారు తెలంగాణలోనే పుట్టి, పెరిగారని, వారు తెలంగాణ యాసలోనే మాట్లాడుతారని, ఇక్కడితో అంతగా మమేకమయ్యారని చెప్పారు. అలాంటి వారిని కాదంటే ఎలా అన్నారు.
విద్యుత్ పీపీఏల అంశానికి, ఫీజు రీయింబర్సుమెంట్స్ అంశానికి సంబంధం లేదన్నారు. కౌన్సెలింగ్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తమతో కలిసి రావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును గౌరవించాలన్నారు. ఏపీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారం కాదనుకొని ముందుకు వస్తే అన్ని సమస్యలు సమసిపోతాయన్నారు. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి మరో ఛాయిస్ లేదన్నారు.