ఉద్యోగ సంఘాలకు షాక్ : చలో విజయవాడకు నో పర్మీషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీసుకువచ్చిన కొత్త పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2న 'చలో విజయవాడ'కు పిలుపునిచ్చాయి. లక్షలాది మంది ఉద్యోగులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరాయి. అయితే ఉద్యోగ సంఘాలకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. కరోనా అంక్షల నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు చేట్టిన ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పారు

చలో విజయవాడకు అనుమతి నిరాకరణ
కరోనా విజృంభిస్తున్న తరుణంలో కేవలం 200 మందితోనే బహిరంగ కార్యక్రమాలకు అనుమతి ఉందని విజయవాడ సీపీ కాంతిరాణ వెల్లడించారు. ఉద్యోగ సంఘాలు చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేశారు. ఈ కార్యక్రమంలో 5వేల మంది పాల్గొంటారని పీఆర్సీ సాధన సమితి దరఖాస్తులో కోరినట్లు సీపీ తెలిపారు. కానీ అంతమందికి అనుమతి లేదని.. ఇది కరోనా నిబంధనలకు విరుద్ధమని కాంతిరాణ వెల్లడించారు. ఉద్యోగులు ఎవరూ చలో విజయవాడ కార్యక్రమానికి రావొద్దని సీపీ సూచించారు.

పాత జీతాలు వేయడం ఎలా సాధ్యం?
ఉద్యోగులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రుల కమిటీ తెలిపింది. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరింది. కొత్త పీఆర్సీ విషయంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని తెలిపారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పడుతున్న వేళ పాత జీతాలు వేయడం ఎలా సాధ్యమని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోవాలని కోరారు. చర్చించుకోవాల్సిన సమయంలో ఉద్యమానికి వెళితే ప్రతిష్టంభన ఏర్పడుతుందని పేర్కొన్నారు..

చలో విజయవాడ నిర్వహించి తీరుతాం
అయితే మంత్రుల కమిటీతో జరిగిన చర్చలు దాదాపు విఫలమైనట్లేనని పీఆర్సీ సాధన సమితి నేతలు పేర్కొన్నారు. ఉద్యోగుల ఆత్మాభిమానంతో ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. తమకు గత్యంతరం లేకనే సమ్మెకు వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని .. తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దలు కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు జీతాలు పెరిగాయని చెప్పడం ఆవాస్తవమని అన్నారు.

సమ్మెతో నష్టం తప్ప.. లాభమేమి లేదు..
చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోవాలని సీఎస్ సమీర్ శర్మ ఉద్యోగులను కోరారు. సమ్మె వల్ల నష్టం తప్ప.. లాభమేమి లేదని పేర్కొన్నారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు వేతనాలు వేస్తామని చెప్పారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని మరో సారి తెలియజేశారు .ఉద్యోగులకు వేతనాలు కచ్చితంగా పెరుగుతాయని, అపోహలు వద్దని సీఎస్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications