Pawan Kalyan: పిఠాపురంలో తొలిరోజే పవన్ కు పోలీసుల షాక్..అనుమతి నిరాకరణ..!
ఏపీలో ఎన్డీయే ఉమ్మడి అభ్యర్ధిగా పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ ఇవాళ తన ప్రచారం ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఉదయమే ప్రత్యేక హెలికాఫ్టర్ లో పిఠాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్ పురూహుతిక అమ్మవారి దర్శనం చేసుకుని ప్రచారం ప్రారంభించాల్సి ఉంది.
దర్శనం తర్వాత వారాహి వాహనంపై పిఠాపురంలో తొలి ఎన్నికల సభ ఏర్పాటు చేసేందుకు పవన్ సిద్దమయ్యారు. అంతలోనే ఆయనకు స్ధానిక పోలీసులు షాకిచ్చారు.

ఇవాళ పిఠాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్ స్ధానిక టీడీపీ నేత వర్మ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబం ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు స్ధానిక దత్తపీఠంలోని పురూహుతిక అమ్మవారి దర్శనం, వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ మధ్యాహ్నం అమ్మవారి ఆలయం మూసి ఉండటంతో ఈ కార్యక్రమం కాస్తా సాయంత్రానికి వాయిదా పడింది. సాయంత్రం 4 గంటల తర్వాత వారాహి వాహనంతో అమ్మవారి ఆలయానికి వెళ్లేందుకు పవన్ సిద్ధం కాగా పోలీసులు షాకిచ్చారు.
వారాహి వాహనంపై ఇవాళ సాయంత్రం పిఠాపురంలో నిర్వహించే సభకు అనుమతి లేదని పోలీసులు పవన్ కళ్యాణ్ కు తేల్చిచెప్పేశారు. ముందుగా అనుమతి తీసుకోకపోవడంతో ఇవాళ వారాహిపై సభకు అనుమతి లేదని తెలిపారు. కాబట్టి చిన్న వాహనంపైనే పవన్ కళ్యాణ్ సభ నిర్వహించుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. దీనిపై జనసైనికులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తొలిరోజే ఆయనకు ఆటంకాలు కల్పిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications