జన సైనికులకు గిరి గీసిన పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ శ్రేణులకు కీలక మార్గనిర్దేశనం చేశారు. ప్రియమైన జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం... అంటూ బహిరంగ లేఖ ద్వారా సందేశాన్నిచ్చారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీలతో ఎన్డీయే కూటమి సాధించిన అద్వితీయ ఘనవిజయం చారిత్రాత్మకం, ఇది కేవలం ఒక్క కూటమి బలమే కాదు, గత ఐదేళ్లలో వైసీపీ సాగించిన నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహ చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతిభద్రత వైఫల్యాలపై విసుగుచెందిన ప్రజలు సుస్థిర ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన , భావి తరాల భవిష్యత్ గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతోనే ఇది సాధ్యమైందన్నారు పవన్ కళ్యాణ్.

అందుకే 94 శాతం విజయంతో 175కి 164 స్థానాలను ఎన్డీయే కూటమికి లభించాయి. అదే సమయంలో... జనసేన పార్టీ 100 శాతం స్ట్రయిక్ రేట్ తో... పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో గెలిపించారన్నారు. ప్రజలు అందించిన ఈ విజయాన్ని బాధ్యతగా భావించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో... కేంద్రం సహాయసహకారాలతో చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయయని పవన్ తెలిపారు. మారుమూల గ్రామాల్లో సైతం రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని వివరించారు. 5 కోట్ల మంది ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని, యువతకు పాతికేళ్ల భవిష్యత్తు అందించాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్.
ఇటువంటి పరిస్థితుల్లో కూటమిలోని మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్లవద్దు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించవద్దు, బహిరంగంగా చర్చించవద్దని పవన్ తేల్చి చెప్పారు. ఎంతో బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో, 2047 నాటికి స్వర్ణ ఆంధ్ర సాధించి, వికసిత్ భారత్ సాధనలో 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసి కట్టుగా ప్రతి ఒక్కరూ
తాను ఏ రోజూ పదవుల కోసం రాజకీయాలు చేయలేదు, ఇక ముందు కూడా అలాంటి రాజకీయాలు చేయనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తనకు తెలిసింది కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడవడం, తాను పుట్టిన నేలను అభివృద్ధి చేయడం మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు. మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్ లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ తన సందేశంలో స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications