ఇంకా అందని అంచనాలు..! ఏపి రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ..!!
Recommended Video
హైదరాబాద్ : గెలుపుకోసం ఒక అడుగు దూరంలో ఉన్నాయని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. కాకపోతే.. పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛన్లు టీడీపీ ని ఒడ్డున పడేస్తాయని తెలుస్తోంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగిపోయిందని, జనం జగన్కు ఒక ఛాన్స్ ఇచ్చే దిశగా తీర్పు ఇచ్చారనే చర్చ కూడా జరుగుతోంది. ఇదీ ఏపీలో ఎన్నికల తరువాత పరిస్థితి. పైగా నెలరోజులపాటు రాజకీయాలను రక్తి కట్టించేందుకు టీడీపీ మరింత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఎలాగూ బాబు జాతీయ రాజకీయాల్లో కీలకం అనే ముద్రను 2019లోనూ కొనసాగించాలని ప్రయత్నిస్తోంది తెలుగుదేశం పార్టీ.
ఏపిలో కొనసాగుతున్న ఉత్కంఠ..! ప్రజానాడి దొరక్క కష్టంగా మారిన అంచనాలు..!!
చంద్రబాబు దేశవ్యాప్తంగా ప్రచారానికి వెళ్తున్నారంటూ ఎద్దేవాచేస్తున్నారు వైసీపీ నేతలు. కానీ.. తాను ఈవీఎంల మీద అనుమానాలతోనే ప్రచారం చేస్తున్నానంటూ తెగేసి చెబుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన మూడు పేజ్ల్లోనూ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ బాబు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. మరో నాలుగు ఫేజ్ల ఎన్నికల వరకూ తాను ఇదే విమర్శలను కొనసాగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈవీయంలలో తప్పులు జరుగుతున్నాయి..! వివిధ రాష్ట్రాల ప్రచారంలో బాబు ఆరోపణలు..!!
ఏపీ పాలనలో సీఎస్ వేలు పెట్టడం, ప్రజాపాలన కుంటుపడటంపై కూడా టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైసీపీ తానే పవర్ లోకి రాబోతున్నామని అంచనా వేసుకుంటూ.. 120 వద్ద ఆగిపోతున్నారు. బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి వంటి నేతలు మాత్రమే అపుడపుడూ 120ను 130, 150కు పెంచుతూ.. జగన్ గుండెలో కొత్తగుబులు పుట్టిస్తున్నారు. ఎందుకంటే.. 81శాతం దాటిన ఓటింగ్తో అంచనాలు ఏ పార్టీకి సరిగా అందట్లేదనే చర్చ కూడా జరుగుతోంది.
పెరిగిన ఓటింగ్..! ఎవరికి మేలుచేస్తుందో తెలియక తికమక..!!
పైగా తెలుగుదేశం పార్టీకు కంచుకోట వంటి నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఓటమి పాలవుతుందనే విషయం తెలుగుతమ్ముళ్లనే కాదు వైసీపీను ఉలికిపాటుకు గురిచేస్తుంది. ఫైనల్గా ఇరు పార్టీల అంచనా ఒక్కటేన్నట్టు తెలుస్తోంది. ఎవరు గెలిచినా 120 సీట్లకు పైగా సాధిస్తారు. ఓడిన పార్టీ ఘోర పరాభవంతో మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండాల్సిందేనంటూ భావిస్తున్నారట. అయితే.. ఆ 120 సీట్లు సాధించే పార్టీ ఎవరనేది మాత్రం అంచనాకు అందకుండా ఉందనే చర్చ జరుగుతోంది.
ఏపి లో నువ్వా నేనా అన్నట్టు రాజకీయం..! ఫలితాల పట్ల టెన్షన్ పడుతున్న పార్టీలు..!!
వైసీపీ బలం ఎంత ఉందో అదేస్థాయిలో బలహీనతలూ ఉన్నాయి. టీడీపీను ఎంతగా జనం కోరుకున్నారో.. ఇప్పుడు అంతగా ద్వేషిస్తున్నారు. మరి మూడో పార్టీ జనసేన ఏమైనా నిశ్చబ్దంగా ఇరుపార్టీల ఓట్లను చీల్చితే.. అపుడిక అది మరో సంచలనం. ఏమైనా 2019లో ఏపీ ఎన్నికలు..భవిష్యత్ రాజకీయాలకు గొప్ప గుణపాఠం.. మరింత రాటుదేలేందుకు రాజకీయాల్లో ఎలా మెలగాలనేది తెలుసుకునేందుకు ఓ ఉదాహరణగా పనికొస్తాయనే ప్రచారం జరుగుతోంది.