APSRTC : విజయవాడ బస్సు ప్రమాదానికి షాకింగ్ రీజన్ -తేల్చిన ఆర్టీసీ దర్యాప్తు కమిటీ..
నిన్న ఉదయం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చిన ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన బస్టాండ్ తో పాటు రాష్ట్రంలోనూ తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో ఆర్టీసీ కూడా ఉలిక్కిపడింది. వెంటనే ప్రమాదంపై విచారణకు ఆదేశించింది. 24 గంటల్లో దర్యాప్తు పూర్తి చేసిన ఆర్టీసీ కమిటీ ఇవాళ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చింది.
ఆర్టీసీ బస్సు ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చి ముగ్గురి ప్రాణాలు తీసిన ఘటనకు కారణాన్ని విచారణ కమిటీ గుర్తించింది. మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గుర్తించిన కమిటీ అధికారులకు సమగ్ర నివేదిక ఇచ్చింది. ఇందులో డ్రైవర్ ప్రకాశం ఆటోమేటిక్ గేరింగ్ వ్యవస్ధపై సరైన శిక్షణ తీసుకోకపోవడమే ఇందుకు కారణంగా తేల్చింది. అందుకే రివర్స్ గేర్ వేయబోయి ఫస్ట్ గేర్ వేయడంతో బస్సు అదుపు తప్పి అడుగు ఎత్తున ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చినట్లు తేల్చారు.

అలాగే కొత్తగా కొనుగోలు చేసిన ఈ మెట్రో లగ్జరీ బస్సును నడిపే విషయంలో డ్రైవర్ తప్పిదం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు విచారణ కమిటీ తేల్చింది. దీంతో ఉన్నతాధికారులకు తదుపరి చర్యల విషయంలో సిఫార్సు చేసింది. ఈ నివేదికలోని అంశాలపై ఇవాళ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అధికారులతో చర్చించారు. దీని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. డ్రైవర్ కు తగిన శిక్షణ ఇవ్వకుండా బస్సు ఎక్కించిన వారితో పాటు ఘటనకు బాధ్యులందరిపైనా ఆర్టీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
అలాగే ప్రమాదానికి కారణమై ముగ్గురి ప్రాణాలు కోల్పోయేందుకు బాధ్యుడైన డ్రైవర్ పై చట్టపరంగా కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ఈ మేరకు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైమైనా ఈ ఘటన ఆర్టీసీలో లోపాల్ని మరోసారి బయటపెట్టింది.












Click it and Unblock the Notifications