సిఎం పదవి కోరడం లేదు, కన్నా కూడా..: డిఎస్
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియలో హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత డి. శ్రీనివాస్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎవరినీ కష్ట పెట్టరని అన్నారు. తెలంగాణ నిర్ణయం చరిత్రాత్మకమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతంగా చేపడుతోందని ఆయన అన్నారు.
ఎన్నికల ముందే రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని డి శ్రీనివాస్ తెలిపారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో సాగుతాయని ఆయన ఆకాంక్షించారు. జిఓఎం నివేదిక రెండు ప్రాంతాల ప్రజలకు ఆమోద యోగ్యంగా ఉంటుందని ఆయన అన్నారు. ఎంతో కమిట్మెంట్ తో కీలక అంశాలను సుదీర్ఘంగా, లోతుగా చర్చలు జరిపి ఇంత త్వరగా జిఓఎం నివేదికను తయారు చేసిన కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు.
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని, అవన్ని వృథా ఆలోచనలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పటవుతున్న తరుణంలో అధిష్టానం సీమాంధ్రులకు ఏమిచ్చినా తెలంగాణవాదులు స్వాగతించాలని ఆయన అన్నారు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని ఆయన చెప్పారు. హైదరాబాద్ పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలో రాజకీయ పార్టీలు, సంఘాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకూడదని అన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జులై 30న తెలంగాణను ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోపాటు అన్ని పార్టీల నాయకులు అంగీకరించారని శ్రీనివాస్ అన్నారు. అయితే ప్రస్తుతం ఆ రాజకీయ పార్టీలు రోజుకోమాట మాట్లాడుతున్నాయని ఆరోపించారు. విద్వేషాలు రెచ్చగొట్టకుండా, రాష్ట్ర విభజనకు సహకరించాలని ఆయన కోరారు. సీమాంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ చాలా దూరంగా ఉన్నందు వల్ల కొత్త రాజధానిని వారు త్వరగా ఏర్పాటు చేసుకుంటారని ఆయన అన్నారు.
విభజన డిమాండ్ ఎప్పటినుంచో ఉందని, సమైక్య ఎప్పుడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. జై ఆంధ్ర ఉద్యమం కూడా ఉందని, సమైక్యం కోసం ఎక్కడా ఉద్యమాలు జరగలేదని ఆయన అన్నారు. తమను వదిలేయవద్దని సీమాంధ్రులు ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. తమకు కావాల్సిందేమిటి అనేదానిపై సీమాంధ్రులు ఆలోచించాలని ఆయన అన్నారు. రాజ్యాంగం ప్రకారమే రాష్ట్ర విభజన జరుగుతుందని, ఎన్నికల ముందే రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని డి శ్రీనివాస్ తెలిపారు.
తాను ముఖ్యమంత్రి పదవిని తాను కోరుకోవడం లేదని, కన్నా లక్ష్మినారాయణ కూడా కోరుకోవడం లేదని డిఎస్ చెప్పారు. పార్టీకి విధేయులైనవారిని కొందరు అప్రదిష్ట పాలు చేస్తున్నారని ఆయన అన్నారు. కన్నా లక్ష్మినారాయణ గురువారంనాడు డిఎస్ను కలిశారు. ఏవో ఊహించుకుని పత్రికలకు ఎక్కడం సరి కాదని ఆయన అన్నారు. తాము ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకోలేదని ఆయన అన్నారు.