రాజ్భవన్ లేదు! రాజధాని ఖర్చుపై 2 కమిటీలు ఇలా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన నివేదికలో కేంద్రం రాజధాని పైన వేసిన శివరామకృష్ణన్ కమిటీ రాజ్ భవన్ను ప్రస్తావించలేదు. ఏపిలో రాజధాని అంశంపై జోరుగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ రెండు కమిటీలు చంద్రబాబుకు నివేదికను ఇచ్చాయి.
అయితే, ఈ నివేదికలో అసెంబ్లీ భవనం, సచివాలయం, ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు.. తదితర అంశాలు ఉన్నప్పటికీ రాజ్ భవన్ను మాత్రం ప్రస్తావించలేదట. మరోవైపు, ఈ రెండు కమిటీలు తమ తమ నివేదికలలో పేర్కొన్న పలు అంశాల్లో వైవిధ్యం కనిపించింది.
రాజధాని నిర్మాణానికి 1.2 లక్షల కోట్ల రూపాయలు అవుతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పగా, 1.40 కోట్ల ఖర్చు అవుతుందని నారాయణ నేతృత్వంలోని స్టేట్ అడ్వైజరీ కమిటీ పేర్కొంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఎనిమిది లైన్ల రహదారి నిర్మాణం కోసం రూ.15,000 కోట్లు అవుతాయని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది. అయితే, ఇందుకోసం రూ.20,000 కోట్లు ఖర్చు అవుతాయని స్టేట్ అడ్వైజరీ కమిటీ పేర్కొంది.