జగన్ సర్కారుకు కేంద్రం మరో షాక్- రాయలసీమ లిఫ్ట్పై హరిత ట్రైబ్యునల్ మెలిక...
రాయలసీమ ప్రాంత తాగు, సాగునీటి ప్రయోజనాలు తీరుస్తుందని భావిస్తున్న పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ( రాయలసీమ లిఫ్ట్)కు బాలారిష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం, కృష్ణాబోర్డు మెలికలు పెడుతుండగా.. ఇప్పుడు కేంద్రం కూడా జగన్ సర్కారుకు హ్యాండిచ్చినట్లే కనిపిస్తోంది. రాయలసీమ లిఫ్ట్కు వ్యతిరేకంగా దాఖలైన ఓ కేసును విచారించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ తన తాజా ఉత్తర్వుల్లో మరో బ్రేక్ వేసింది. కేంద్ర జల్శక్తి శాఖ ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగానే జాతీయ హరిత ట్రైబ్యునల్ ఈ తీర్పు ఇవ్వడంతో కేంద్రం తీరుపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రాయలసీమ లిఫ్ట్పై ఎన్జీటీ విచారణ..
కృష్ణానదిలో ఏపీ వాటాగా ఉన్న మిగులు జలాలను ఆధారంగా చేసుకుని రాయలసీమలోని పొతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు అనుబంధంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్పై తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఏపీ వాటాకు మించి నీటిని తోడుకునేందుకు ఇది వీలు కల్పిస్తుందని తెలంగాణ వాదిస్తోంది. సరిగ్గా ఇదే అభ్యంతరాలతో జాతీయ హరిత ట్రైబ్యునల్లో దాఖలైన కేసును విచారించిన ఎన్టీటీ చెన్నై ధర్మాసనం కేంద్రం అభిప్రాయం కోరింది. దీనికి సమాధానంగా జల్శక్తి మంత్రిత్వశాఖ దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా ఎన్జీటీ ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.
పర్యావరణ అనుమతులు తప్పనిసరి...
తెలంగాణ సర్కారు ముందునుంచీ వాదిస్తున్న విధంగానే రాయలసీమలిఫ్ట్కు పర్యావరణ అనుమతులు తప్పనిసరని కేంద్రం ఇచ్చిన సమాధానంతో ఎన్జీటీ కూడా దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్పై ముందుకెళ్లొద్దని ఏపీ ప్రభుత్వానికి హరిత ట్రైబ్యునల్ తన తాజా తీర్పులో ఆదేశాలు ఇచ్చింది. ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించి అనుమతులు తీసుకోవాల్సిందేనని జగన్ సర్కారుకు స్పష్టం చేసింది. రాయలసీమ లిఫ్ట్ ద్వారా తాగునీటి, సాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉన్నందున పర్యావరణ అనుమతుల్లేకుండా ప్రాజెక్టు నిర్మించడం సరికాదని ఎన్జీటీ అభిప్రాయపడింది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాల్సి ఉంది.
కేంద్రం నుంచి సహకారం కరవు...
కీలకమైన రాయలసీమ లిఫ్ట్ను ఎలాగైనా నిర్మించి తీరాలని పట్టుదలగా ఉన్న జగన్ సర్కారుకు కేంద్రం నుంచి ఆ మేరకు సహకారం లభించడం లేదు. ముఖ్యంగా కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్.. జగన్తో గతంలో భేటీలోనూ కీలకమైన పోలవరం, రాయలసీమ లిఫ్ట్పై హామీలిచ్చినా అటు జాతీయ హరిత ట్రైబ్యునల్కు పంపిన అఫిడవిట్లో మాత్రం పర్యావరణ అనుమతులు తప్పనిసరని స్ఫష్టం చేశారు. అవి లేకుండా తాము కూడా ప్రాజెక్టుకు సహకరించలేమని తేల్చేశారు. దీంతో కేంద్ర పర్యావరణశాఖ నుంచి అనుమతుల్లేని ప్రాజెక్టుకు తాము కూడా క్లియరెన్స్ ఇవ్వలేమని హరిత ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు కేంద్రం వద్ద లాబీయింగ్ చేసి అనుమతులు తెచ్చుకుంటుందా లేక గతంలో ఉన్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు అనుబంధమే కాబట్టి అనుమతులు అక్కర్లేదని వాదిస్తుందా చూడాలి.