రిస్క్ ఎందుకు: ప్రకాశం, నెల్లూరు జిల్లా వైసీపీ టికెట్లు వీరికేనా...?
ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అప్పుడే వేడెక్కుతున్నాయి. తెలంగాణలో నేతలు టీఆర్ఎస్లోకి వెళుతుండగా... ఏపీలో నేతలు వైసీపీవైపు చూస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయారు. ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రలో బిజీగా ఉంటూ టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్నారు.
ఒకవైపు పాదయాత్రలో బిజీగానే ఉంటూ మరోవైపు జగన్ రాజకీయచతురతకు పదను పెడుతున్నారు. గతంలోలా కాకుండా ఈసారి చాలా జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సారి గెలిచేవారికే టికెట్లు ఇచ్చేలా పక్కా ప్లాన్ తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో బంధుప్రీతిగానీ, సొంత వర్గంకానీ, మిత్రులకు గానీ టికెట్లు కేటాయించే పరిస్థితి లేనట్లుగా కనిపిస్తోంది. ఎవరైతే గెలుస్తారో వారికే టికెట్లు ఇచ్చేందుకు వైసీపీ అధినేత పూనుకున్నారు.
వైసీపీలో
ప్రస్తుతం వైసీపీలో చాలామంది సీనియర్లకు టికెట్ దక్కకపోవచ్చనే మాట వినబడుతోంది. సీనియర్లు అందరిని పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా అధినేత సూచించినట్లు సమాచారం. పార్టీ అధికారంలోకి రాగానే వారికి కీలక బాధ్యతలు అప్పజెప్పేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి, విజయ్ సాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మానా ప్రసాద్ రావు, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పార్థసారథిలాంటి వారిని ఎన్నికల మేనేజ్మెంట్ టీమ్గా తయారు చేశారు. అయితే వీరిలో కొందరికి టికెట్ తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది.
వైవీ సుబ్బారెడ్డి
వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి టికెట్ దక్కకపోవచ్చనే వార్త వైసీపీలో చక్కర్లు కొడుతోంది.మాజీ ఎంపీ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు దాదాపు డిసైడైనట్లు తెలుస్తోంది. శ్రీనివాసుల రెడ్డి వైసీపీలో చేరితే ఒంగోలు ఎంపీ టికెట్ ఆయనకే ఇచ్చే అవకాశముంది. ఇక ఇతర ప్రకాశం జిల్లా సీట్ల విషయానికొస్తే... 2014లో ఒక సీనియర్ నేత కారణంగానే వైసీపీ మూడు కీలక సీట్లు ఓడిపోయిందనే టాక్ ప్రకాశం జిల్లా వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇక ఇప్పటికే ఆ జిల్లాలో ఫ్యామిలీ వార్స్ ముదిరి పాకాన పడుతున్నాయి. వైసీపీ నుంచి అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరారు. గొట్టిపాటి చేరికతో కరణం ఫ్యామిలీకి పసుపు పార్టీలో ప్రాధాన్యత తగ్గింది. దీంతో కరణం బలరాం వైసీపీ వైపు చూస్తున్నారు. అద్దంకి టికెట్ తన కొడుకు కరణం వెంకటేష్కు కేటాయించాలని చంద్రబాబును కోరినా...ఇవ్వడం కుదరదని తేల్చేశారు. దీంతో కరణం వైసీపీతో టచ్లోకి వచ్చారు. వెంకటేష్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అక్కడ వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉండటంతో ముందు పార్టీ బాధ్యతలు తీసుకుని గెలుపునకు కృషి చేయాల్సిందిగా కోరారట. అదేసమయంలో కరణం బలరాం లాంటి నేతలను వదులుకునేందుకు జగన్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
ఆనం రామనారాయణరెడ్డి
ఇక నెల్లూరు జిల్లా పరిస్థితి ఈసారి వైసీపీకి కాస్త ఫేవర్గానే కనిపిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయంలో జగన్ను నెల్లూరు టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. జగన్ను కలిసి పార్టీలోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జగన్ను ఆనం వెంకటగిరి సీటు కేటాయించాల్సిందిగా కోరినట్లు సమాచారం. అయితే స్పష్టమైన హామీ ఇవ్వలేదని టాక్.
ఇక వెంకటగిరి టికెట్ను ఆశిస్తున్న వారిలో మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు నేదురమల్లి రాంకుమార్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. వెంకటగిరి టికెట్ ఇస్తే తాను పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. వెంకటగిరిలో ఆనం వర్గం కూడా కలిస్తే ఇక వైసీపీకి తిరుగుండదనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు నెల్లూరు జిల్లాలో బలమైన నేతలుగా ముద్రపడ్డ ఆదాల కూడా పార్టీమారి వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక నెల్లూరు అర్బన్ నుంచి మంత్రి నారాయణ టీడీపీ తరుపున పోటీచేసే యోచనలో ఉన్నారు.
మేకపాటి
గత ఎన్నికల్లో మేకపాటి కుటుంబం నుంచి మూడు టికెట్లను కేటాయించారు జగన్. ఆత్మకూరు నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు మేకపాటి గౌతం రెడ్డి విజయం సాధించగా... ఉదయగిరి బరినుంచి వైసీపీ తరుపున పోటీచేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఓటమి చవిచూశారు. అయితే ఈసారి గౌతం రెడ్డిని ఎంపీగా పంపే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. రాజమోహన్ రెడ్డి ఆరోగ్య రీత్యా ఆయన క్రియాశీల రాజకీయాలనుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సారి లోక్సభకు బాగా చదువుకున్న అభ్యర్థులను పంపించే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ లెక్క ప్రకారమే అభ్యర్థుల ఎంపిక కూడా ఉండే అవకాశం ఉంది.
కొవ్వూరులో నల్లపనేని ప్రసన్నకుమార్ రెడ్డి వర్గం బలంగా ఉంది. ఇక సర్వేపల్లిలో కూడా వైసీపీ క్యాడర్ బలంగానే ఉంది. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి అక్కడ పోటీ చేసి పలుమార్లు అపజయం మూటగట్టుకున్నారు. మొత్తం 10 సీట్లున్న నెల్లూరు జిల్లాల్లో 2014లో ఏడు సీట్లు వైసీపీ దక్కించుకుంది. అయితే ఈ సారి మిగతా మూడు సీట్లు కూడా దక్కించుకుని క్లీన్ స్వీప్ చేసే యోచనలో వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మొత్తానికి వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీ బలంగా కనిపిస్తుండగా.. నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా పార్టీ పుంజుకున్నట్లు పలు అంతర్గత సర్వేలు వెల్లడిస్తున్నాయి.