హోదా లేదు, భారీ ప్యాకేజీ, అమరావతికి 5వేలకోట్లు: నో చెప్పిన బాబు, పవన్కు నో రెస్ట్!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హోదా కంటే మించి ప్యాకేజీని ఏపీకి ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ విషయమై మూడు నాలుగు రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబుతో, కేంద్రమంత్రి సుజనా చౌదరితో కేంద్రమంత్రులు జోరుగా సంప్రదింపులు జరుపుతున్నారు.
ప్రత్యేక హోదా బదులు అంతకు మించిన ప్యాకేజీ ఇస్తామని కేంద్రమంత్రులు చంద్రబాబుకు, సుజనా చౌదరికి చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా, బుధవారం నాడు ప్రధాని మోడీ, ఇతర కేంద్రమంత్రులతో హోదాపై చర్చలు జరిపిన వెంకయ్య నాయుడు అదే విషయమై చంద్రబాబుతో చర్చించేందుకు ఢిల్లీ నుంచి వచ్చారు.

ప్యాకేజీ సిద్ధమవుతోంది
హోదా బదులు ఏపీకి ఇచ్చే ప్యాకేజీని కేంద్రం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇటీవల మరింత కసరత్తు చేస్తోంది. ప్యాకేజీ పైన కసరత్తు నేపథ్యంలోనే కేంద్రమంత్రులు, చంద్రబాబు, సుజనలతో చర్చలు జరుపుతోంది.
అమరావతికి రూ.5వేల కోట్ల వరకు
ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేనందున, అదేవిధంగా భారీ ప్యాకేజీ ఇవ్వాలని భావిస్తున్నందున ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.4వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ప్రత్యేకంగా కేటాయించాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. ప్రత్యేక ప్యాకేజీకి అధిష్టానం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని తెలుస్తోంది.
బాబుకు కేంద్రం హామీలివే!
ఏపీకి రెవెన్యూ లోటు భర్తీ చేస్తాం.
ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీల కన్నా మెరుగైనవి ఇస్తాం.
రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.4వేల నుంచి రూ.5 కోట్ల ప్రత్యేక నిధి.
ఏపీ బీజేపీ నేతలతో చర్చలు
ప్రత్యేక హోదా బదులు భారీ ప్యాకేజీ విషయమై కసరత్తు చేస్తున్నామని, తుది దశకు చేరుకుందని ఏపీ బీజేపీ నేతలతోను అధిష్టానం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఏం చేయాలో ఏపీ నేతలతో చర్చిస్తున్నారని తెలుస్తోంది.
హోదాపై తగ్గం, కేంద్రం సంప్రదిస్తోంది: బాబు
ఢిల్లీలో ప్రత్యేక హోదా, ప్యాకేజీ, ఏపీకి ఇచ్చిన హామీల పైన కదలిక నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు స్పందించారు. కేంద్ర పెద్దలు ప్రత్యేక హోదా పైన సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా పైన త్వరలో స్పష్టత వస్తుందని తాను భావిస్తున్నానని చెప్పారు. కేంద్రం సంప్రదింపులు జరుపుతోందన్నారు. హోదా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోను రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధానికి నిధులు, ఆర్థిక లోటు భర్తీ, బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ కావాలన్నారు.
కేంద్రం ఇచ్చిన ప్యాకేజీల పైన టెలి కాన్ఫరెన్సులో నేతలకు వివరించారు. కేంద్రం ప్రతిపాదనలు అంగీకరించమన్నారు. ఉదయం నుంచి చంద్రబాబు నేతలతో ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు.
పవన్ కళ్యాణ్కు నో రెస్ట్!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, ఆ హామీ నెరవేర్చే వరకు తాను ఉద్యమిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏపీకి హోదా బదులు భారీ ప్యాకేజీకి కేంద్రం సూత్రప్రాయంగా ఓకే చెప్పినందున... హోదా కోసం ఉద్యమిస్తానన్న పవన్కు అదే దారిలో నడిచే అవకాశాలున్నాయి. అయితే, హోదాకు మించి ప్యాకేజీ ఉండి, ఏపీ ప్రజలు సంతృప్తి చెందేలా ఉంటే మరో ఆలోచన చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.












Click it and Unblock the Notifications