మహాత్ముడితోనే: జగన్ దీక్షలపై జెసి వ్యంగ్యం, హోదాపై మరోసారి కుండబద్దలు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షల పైన తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి తనదైన శైలిలో బుధవారం నాడు వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
జగన్ దీక్షలు ఓ జిమ్మిక్కేనన్నారు. అయినా దీక్షలకు మహాత్మా గాంధీతోనే కాలం చెల్లిపోయిందన్నారు. పెట్రోల్ పోసి తగులబెట్టుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని మరోసారి కుండబద్దలు కొట్టారు.
జగన్ దీక్ష ఓ జిమ్మిక్కని, జగన్ దీక్ష వృథా అన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవని ఎద్దేవా చేశారు. దీక్ష చేస్తే పోలీసులు ఎత్తుకెళ్లి ఇంజక్షన్లు ఎక్కిస్తారని, పెట్రోల్ పోసీ తగులబెట్టుకున్నా ఏపీకి ప్రత్యేక హోదా రాదన్నారు.

జెసి మంగళవారం కూడా ప్రత్యేక హోదా పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అనే పదం అర్థం కాకపోయినా ప్రజలు అదే కావాలంటున్నారన్నారు. అయితే ప్రత్యేక హోదా అనే పదాన్ని ఉపయోగించేందుకు భాజపా సిద్ధం లేదన్నారు.
ఇవి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే రోజులు కావని. హోదాలో ఉన్న దాని కంటే ఎక్కువ ప్రయోజనం కల్పిస్తామంటే ఒప్పుకుని తీరాల్సిందేనన్నారు. ప్రత్యేకహోదా కోసం ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదన్నారు.
చంద్రబాబు చాలా తెలివైన, పరిపాలన అనుభవం వ్యక్తి అన్నారు. కోపం, తాపం లేకపోవడం వల్లే చంద్రబాబు ఈతరం వాడు కాదేమోనని జగన్ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. చంద్రబాబుతో పోల్చుకునే స్థాయి జగన్కు లేదన్నారు.
జగన్ ప్రత్యేక హోదా తెస్తానంటే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ప్రత్యేక హోదా కోసం తనతో పాటు మరో పది మంది ఎంపీ రాజీనామాకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేసినా ప్రత్యేక హోదా రాదన్నారు.












Click it and Unblock the Notifications