పార్లమెంట్ లో అవిశ్వాసం.. ప్రేక్షక పాత్రలో వైసీపి ఎంపీలు..
ప్రత్యేక హోదా పోరాటంలో తన చిత్తశుద్ది నిరూపించుకోవడానికి జగన్ తన లోక్ సభ సభ్యుల చేత రాజీనామా చేయించారు. ఎం.పిల త్యాగంతో బీజేపీ,టీడీపీలను దెబ్బతీయవచ్చునని అంచనా వేశారు. కాని లోక్ సభ సభ్యులు మాజీలు కావడం మినహా జగన్ కు ఏమీ మిగలలేదు. పైగా ఉప ఎన్నికలు కూడా రాకపోవడంతో వైసీపీ అధినేత వ్యూహాం బెడిసికొట్టింది. ఇదే సమయంలో పార్లమెంటులో తాజాగా జరుగుతున్న పరిణామాలు వైసీపీ నాయకులను,కార్యకర్తలను ఆవేదనకు గురి చేస్తున్నాయి.
వైసీసి తొందరపాటు నిర్ణయం.. ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ లో మాట్లాడే ఛాన్స్ మిస్..
వై.ఎస్ జగన్ మళ్ళీ బురదలో కాలేశారు.తొందరపడి రాజకీయాలు చేయడంలో తనకు తానే సాటి అని జగన్ మరో సారి నిరూపించుకున్నారు.ప్రత్యర్థి మీద పైచేయి సాధించాలన్న ఆలోచనతో తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు ఏ మాత్రం కలిసిరావడం లేదు. 2014 ఎన్నికల సమయంలో తనకు తోచినట్లుగా వ్యవహారించి ప్రతిపక్షంలో కూర్చున్న జగన్ లో పెద్దగా మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టాలన్న తాపత్రయంలో వైసీపీ అధినేత రచిస్తున్న వ్యూహాలు చివరకు తన మెడకే చుట్టుకుంటున్నాయి.
Recommended Video
వైసీపి ఎంపీలు రాజీనామాలతో సాధించిందేమిటి..
అవిశ్వాస తీర్మానాన్ని ఇంత కాలం పట్టించుకోని మోదీ సర్కార్ అదే అంశంలో అకస్మాత్తుగా రూట్ మార్చింది. గత సెషన్ లో టీడీపీ, వైసీపీలు పోటీపడి మరి అవిశ్వాసంపైన చర్చకు పట్టు పట్టాయి. అయితే సభలో గందరగోళ పరిస్థితులు ఉన్న కారణంగా అవిశ్వాస నోటీసు చదవడానికి కూడా స్పీకర్ సుమిత్రా మహజన్ ఒప్పుకోలేదు. అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజునే టీడీపీ అవిశ్వాస నోటీసును స్పీకర్ అనుమతించారు. విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని ఇచ్చిన నోటీసును స్వీకరించారు. నో కాన్ఫిడెన్స్ కు యాభై మంది సభ్యుల మద్దతు ఉండటంతో స్పీకర్ అవిశ్వాసంపైన చర్చకు ఓకే చెప్పారు. ఈ సమావేశాల ముగింపు సమయానికి చర్చ జరగబోతోంది.
ఉప ఎన్నికలు కూడా లేకపోవడంతో ఉనికి కోల్పోయే ప్రమాదం..
అవిశ్వాసం వల్ల ఎన్డీఎ సర్కార్ పడిపోయే అవకాశాలు ఏ మాత్రం లేవు. అయితే ప్రత్యేక హోదా అంశంతో పాటు అనేక అంశాలపైన ప్రతిపక్షాలు గళం విప్పబోతున్నాయి. అయితే ఈ జాబితాలో మాత్రం వైసీపీ లేదు. దానికి కారణంగా వై.ఎస్ జగన్. రాజీనామాలతో టీడీపీ పైన పై చేయి సాధించాలన్న ఆయన వ్యూహాం ఇక్కడ బెడిసికొట్టింది. కీలకమైన సమయంలో లోక్ సభలో ఆ పార్టీ గళం వినిపించడానికి అవకాశం లేకపోయింది. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్దితో పోరాటం చేస్తామని చెపుతున్న జగన్ పార్టీ అసలైన సందర్భంలో కనిపించకుండా పోయింది. ప్రధాని మోదీని ఆయన ముందే కడిగిపారే అవకాశాన్ని వైసీపీ ఎం.పిలు కోల్పోయారు.
వైసీపి ఎంపీల రాజీనామాల వల్ల ఉపయోగం కాన్నా నష్టమే ఎక్కువ..
బీజేపీపైన పోరాటంలో తన విధానాన్నిఅత్యంత బలంగా చెప్పుకునే ఛాన్స్ జగన్ పార్టీకి లేదు.ఇదే సమయంలో ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీఎ సర్కార్ ను ఉతికిఆరేసే అవకాశం తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఆ పార్టీకి చెందిన కనీసం ముగ్గురు ఎం.పిలు అవిశ్వాసంపైన గళమెత్తబోతున్నారు. ఇదే సమయంలో మెదీపైన అవిశ్వాసం పెట్టారన్న ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కబోతోంది. ప్రత్యేక హోదా పోరాటంలో నోకాన్ఫిడెన్స్ ఓ మైలు రాయి కాబోతోంది. కాని ఇందులో ఆంధ్రప్రదేశ్ లో బలమైన పార్టీ వైసీపీ లేకపోవడమే లోటుగా కనిపిస్తోంది.