సిఎం పార్టీ పెట్టరు: కొండ్రు, లాభం లేదన్న రఘువీరా
శ్రీకాకుళం/అనంతపురం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టరని, ఆయన పార్టీ పెడతారని వస్తున్న వార్తలు ఊహాగానాలేనని రాష్ట్రమంత్రి కొండ్రు మురళీ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడరని చెప్పారు. రాష్ట్రంలో కొత్త పార్టీ రావడం కలే అని కొండ్రు మురళీ వ్యాఖ్యానించారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కొండ్రు మురళీ అన్నారు. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం దురదృష్టకరమని కొండ్రు మురళీ అన్నారు.

సిఎం పార్టీ పెట్టినా ప్రయోజనం ఉండదు: రఘువీరా
అనంతపురం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టినా పెద్ద ప్రయోజనమేమి ఉండదని రాష్ట్రమంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రాజీనామా వల్ల ప్రయోజనం లేదని తెలిపారు.
అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నిప్పుపెట్టడాన్ని దుశ్చర్యగా అభివర్ణించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలతో కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిస్తే ప్రయోజనం ఉండే అవకాశం ఉందని రఘువీరారెడ్డి తెలిపారు. విభజనకు అన్ని పార్టీలు కారణమైనా కాంగ్రెస్నే దోషిగా చూడటం దారుణమన్నారు.
సిఎంకు అండగా ఉంటాం: పార్థసారథి
విజయవాడ: సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తామంతా అండగా ఉంటామని రాష్ట్ర మంత్రి పార్థసారథి అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు సీమాంధ్ర ప్రజల మనసులతో ఆడుకుంటున్నాయని అన్నారు. విభజనను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లోక్సభలో ఘటనను సాకుగా చూపి సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications