‘తెలంగాణ ఉల్లంఘనలకు పాల్పడలేదు’: ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదుకు జవాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తెలంగాణ ఉల్లంఘిస్తోందని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం రాజ్యసభసభ్యుడు సీఎం రమేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి సన్వర్ లాల్ జాట్ సమాధానమిచ్చారు.
కేంద్ర జల వనరుల కమిషన్ (సీడబ్ల్యూసీ), కృష్ణా నదీ జలాల నిర్వహణ మండలి (కేఆర్ఎంబీ)ల అనుమతి తీసుకోకుండానే పాలమూరు-రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలను తెలంగాణ చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసిందని ఆయన వివరించారు.
అయితే తమ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి(జూన్ 2, 2014) నుంచీ ఎలాంటి కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టలేదని గత సంవత్సరం ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం ఓ లేఖ పంపిందని ఆయన పేర్కొన్నారు. దానిలో తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని రాసివున్నట్లు వెల్లడించారు.

'పోలవరం' ఆరోపణలపై విచారణ లేనట్లే!
పునరావాసం కల్పించకుండానే పోలవరం ఆనకట్ట ప్రాంతం నుంచి ప్రజలను అక్రమంగా ఖాళీ చేయిస్తున్నారంటూ వెల్లువెత్తుతున్న తీవ్ర ఆరోపణలపై విచారణ జరిపే దిశగా కేంద్ర జల సంఘం ఎలాంటి సూచన చేయలేదు.
ప్రాజెక్టు ప్రాంతం నుంచి మహిళలను అక్రమంగా వెళ్లగొట్టడానికి సంబంధించి ఎలాంటి విశ్వసనీయ సమాచారం లేదని కేంద్ర జల వనరుల శాఖ సహాయమంత్రి సన్వర్లాల్ జాట్ రాజ్యసభలో సోమవారం రాతపూర్వకంగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications