చింతమనేనిపై 'రెవెన్యూ' ఆగ్రహం: ఆత్మహత్య చేసుకుంటానని వనజాక్షి కంటతడి
ఏలూరు/విజయవాడ: కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు వనజాక్షి పైన తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు జరిపిన దాడి పైన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగులు భగ్గుమంటున్నారు.
రెవెన్యూ అసోసియేషన్ సలహాతో ఎమ్మెల్యేపై వనజాక్షి ముసునూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది.
దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుంటే ఊరుకునేది లేదని రెవెన్యూ సిబ్బంది హెచ్చరించింది. రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున విజయవాడ కలెక్టరేట్కు తరలి వచ్చారు. దాడికి పాల్పడిన వారి పైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే పుష్కరాలు బహిష్కరిస్తామని హెచ్చరించారు.
ఏలూరు కలెక్టరేట్ వద్ద పలువురు ధర్నాకు దిగారు. కర్నూలు జిల్లా నంద్యాలలో, చిత్తూరు జిల్లా తిరుపతిలో రెవెన్యూ అధికారులు విధులు బహిష్కరించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు.
నాన్ బెయిలబుల్ కేసు
దాడి కేసులో 52 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 353, 334, 379 సెక్షన్ల కింద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన గన్మెన్లు, పలువురు డ్వాక్రా మహిళల పైన నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇసుక తవ్వకాలు జరుగుతుండగా.. ఎమ్మార్వో వనజాక్షి, సిబ్బంది ప్రశ్నించడంతో దాడి జరిగింది.
కౌంటర్ కేసు
ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి తమ పైన దాడి చేశారంటూ డ్వాక్రా మహిళలు కేసు పెట్టారు. ఎమ్మార్వో వనజాక్షితో పాటు అధికారులు తమ పైన దాడికి పాల్పడ్డారని పలువురు ప్రతి ఫిర్యాదు చేశారు. మహిళల ఫిర్యాదుతో ఎమ్మార్వోతో పాటు అధికారులపై పెదవేగి పోలీసులు మెడికల్ లీగల్ సెక్షన్ 35 కింద కేసు నమోదు చేశారు.
వనజాక్షిపై దాడిని ఖండించిన వైసీపీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు దాడిని ఖండించారు. సీఎం, డిప్యూటీ సీఎంలు దీనిపై మాట్లాడక పోవడం విడ్డూరమన్నారు. వనజాక్షికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలుపుతోందని చెప్పారు.
ఆత్మహత్య చేసుకుంటా: వనజాక్షి
తన పైన వేధింపులు ఆపకుంటే ఆత్మహత్య చేసుకుంటానని వనజాక్షఇ హెచ్చరించారు. తన పైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆమె కంటతడి పెట్టారు. రేపటిలోగా ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, తహసీల్దారు పైన దాడి ఘటనను హెచ్చార్సీ సుమోటోగా స్వీకరించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 13లోగా సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించింది.