అటు విశాఖ..ఇటు చంద్రబాబు: ఇరకాటంలో ఉత్తరాంధ్ర టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు..!
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో అంతర్మథనం మొదలైందా? విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా అంగీకరించడమా? లేక పార్టీ అగ్ర నాయకత్వం వెంట నడవడమా? అనే డైలమాలో ఉన్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అటు పరిపాలనా రాజధానిగా అవతరించబోతోన్న విశాఖపట్నం.. ఇటు దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తోన్న పార్టీ అధినేత చంద్రబాబు.. ఈ రెండింట్లో ఏదో ఒక అంశాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితిని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబుపై దాడికి నిరసనగా టీడీపీ భారీ యాక్షన్ ప్లాన్: అమరావతి గ్రామాలు సహా..!
టీడీపీకి కంచుకోటగా.. ఉత్తరాంధ్ర
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటివనడంలో సందేహాలు అక్కర్లేదు. పార్టీ ఆవిర్భావం నుంచీ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు టీడీపీ వెంటే నడిచాయి. 2004, 2009 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభంజాన్ని టీడీపీ తట్టుకుని నిలవగలగడానికి ఉత్తరాంధ్ర జిల్లాలే ప్రధాన కారణం. గత ఏడాది ముగిసిన ఎన్నికల్లో టీడీపీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఫర్వాలేదనిపించుకుంది. టీడీపీకి చెందిన ఆరుమంది ఎమ్మెల్యేలు, ఒక లోక్సభ సభ్యుడు ఈ ప్రాంతం నుంచి ఎన్నికయ్యారు.
పరిపాలనా రాజధాని ప్రకటనతో..
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కూడా వెనుకబడినవే. కోస్తా జిల్లాలతో పోల్చుకుంటే..అభివృద్ధిలో వెనుక వరసలోనే ఉంటున్నాయి. ఈ ప్రాంతంలో గరిష్ఠంగా అభివృద్ధి చెందిన నగరం అంటూ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే. సాగర నగరంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం.. మన రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరంగా చెప్పుకోవచ్చు.. అన్ని రంగాల్లో కూడా. అలాంటి నగరాన్ని పరిపాలనకు కేంద్రబిందువుగా చేసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏకంగా సచివాలయాన్ని విశాఖకు తరలించడానికి ముహూర్తం చూసుకుంటోంది.
ఏజెన్సీ ఏరియాల అభివృద్ధికి అవకాశం..
విశాఖను రాజధానిగా మార్చడం వల్ల ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అటు ప్రభుత్వం గానీ, అధికార పార్టీ నాయకులు గానీ బలంగా విశ్వసిస్తున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చడం వల్ల నిర్మాణరంగం ఊపందుకోవడానికి అవకాశాలు ఉంటాయని, రాజధానికి సహజసిద్ధంగా రావాల్సిన పరిశ్రమలు ఏర్పడతాయని చెబుతున్నారు వైసీపీ నాయకులు. అదే సమయంలో మౌలిక వసతులు మెరుగుపడతాయని, ఏజెన్సీల్లోని అనేక గ్రామాలకు కనీస సౌకర్యాలను కల్పించడానికి కారణమౌతుందనీ అంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు అరికట్టడానికి ఇదొక్కటే మార్గమనే వారూ లేకపోలేదు.
టీడీపీకి ఇబ్బందికరమంటూ..
ఆ అంశమే తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఇబ్బందికి గురి చేస్తోందని చెబుతున్నారు. విశాఖలో సచివాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆ క్రెడిట్ వైఎస్ఆర్సీపీకి వెళ్తుందనే భయం టీడీపీ నేతల్లో కనిపిస్తోందని, దాని ఫలితమే- రాజధానిగా విశాఖను పార్టీ అగ్ర నాయకత్వం అంగీకరించలేకపోతోందని అంటోంది వైసీపీ క్యాడర్. ఈ పరిస్థితుల్లో ఏదో ఒక అంశాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు.
Recommended Video
చంద్రబాబుపై దాడితో కీలక పరిణామాలు..
విశాఖపట్నం విమానాశ్రయం వద్ద చంద్రబాబుపై కోటు చోటు చేసుకున్న దాడి తరువాత టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో మరింత కలవరపాటు మొదలైందని అంటున్నారు. విశాఖపట్నాన్ని రాజధానిగా అంగీకరిస్తే.. పార్టీలో గుర్తింపు ఉండదని, అదే సమయంలో విశాఖను రాజధానిగా వ్యతిరేకించాల్సిన వస్తే.. ప్రజల్లో పలుచన అవుతామనే ఆందోళన వారిలో నెలకొందని, ప్రతిఘటన ఎదురు కావచ్చని అనుమానిస్తున్నారు. చంద్రబాబుపై చోటు చేసుకున్న దాడిని దీనికి ఉదాహరణగా తీసుకుంటున్నారు. విశాఖను వ్యతిరేకించాల్సి వస్తే.. ప్రజలకు సమాధానాన్ని చెప్పుకోవాల్సి రావచ్చని అంటున్నారు.