శేఖర్ రెడ్డికి షాక్: బెయిల్ నిరాకరించిన కోర్టు
పెద్ద యెత్తున నగదును, బంగారాన్ని కూడబెట్టిన ఇసుక వ్యాపారి శేఖర్ రెడ్డికి కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన అనుచరులకు కూడా కోర్టు బెయిల్ ఇవ్వలేదు
చెన్నై: ఇసుక వ్యాపారి శేఖర్ రెడ్డికి, మరో నలుగురికి సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ కోసం వారు పెట్టుకున్న పిటిషన్లను తోసిపుచ్చింది. వారి ఇళ్ల నుంచి అధికారులు రూ.170 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసింది. వాటిలో కొత్త నోట్లు కూడా ఉన్నాయి.
వారికి బెయిల్ నిరాకరిస్తూ సిబిఐ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి విజయలక్ష్మి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వారి కస్టడీని కోరుతూ సిబిఐ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను కూడా న్యాయమూర్తి డిస్మిస్ చేశారు. ఆ ఐదుగురు కూడా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు నలుగురు పెట్టుకున్న పిటిషన్లపై వాదనలను ముగిసిన తర్వాత కోర్టు తన నిర్ణయాన్ని డిసెంబర్ 27వ తేదీన రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులను సిబిఐ డిసెంబర్ 21వ తేదీన అరెస్టు చేసింది.
వారి నివాసాల్లో 170 కోట్ల రూపాయల నగదుతో పాటు 127 కిలోల బంగారం కూడా సిబిఐకి చిక్కాయి. వారంతా లెక్క తెలియని నగదును కొత్త నోట్ల రూపంలోకి మార్చడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.