న్యాయం చేయండి, రైతుల కంటతడి: బాబుపై మరో ఫిర్యాదు, అడుగుతానని పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వరుసగా సమస్యల పైన స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వద్దకు పలువురు వరుస కడుతున్నారు. తాజాగా, పోలవరం డంపింగ్ బాధితులు ఆయనను బుధవారం నాడు కలుసుకున్నారు.
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సమస్యల పైన స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వద్దకు పలువురు వరుస కడుతున్నారు. తాజాగా, పోలవరం డంపింగ్ బాధితులు ఆయనను బుధవారం నాడు కలుసుకున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మట్టి డంపింగును మూలలంక రైతులు వ్యతిరేకిస్తున్నారు. డంపింగుకు 203 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తోంది. దీనిపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయాన్ని రైతులు జనసేన అధినేత దృష్టికి తీసుకు వెళ్లారు.
పవన్ కళ్యాణ్ను కలిసిన వారిలో అమరావతి, పోలవరం ప్రాంతాల రైతులు ఉన్నారు. భూసమీకరణ విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం రైతులు పవన్కు చంద్రబాబు ప్రభుత్వం పైన ఫిర్యాదు చేశారు.

కంటతడి పెట్టిన రైతులు.. అడుగుతానన్న పవన్
పవన్ కళ్యాణ్కు తమ బాధలు చెప్పే సమయంలో మూలలంక, లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం రైతులు కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ప్రభుత్వం సరైన పునరావాసం కల్పించడం లేదన్నారు.
సమస్య పైన తొలుత మంత్రులతో మాట్లాడుతానని, అప్పటికి పరిష్కారం కాకుంటే క్షేత్రస్థాయిలో పోరాడుతానని చెప్పారు. ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. తాను ప్రభుత్వం నుంచి వివరణ కోరుతానని చెప్పారు. స్పందించకుంటే మూలలంకలో పర్యటిస్తానని చెప్పారు.
పవన్ కళ్యాణ్ ఇటీవల వరుసగా సమస్యల పైన స్పందిస్తోన్న విషయం తెలిసిందే. రాజధాని అమరావతి రైతుల విషయమై ఆయన ప్రశ్నించారు.
ఆ తర్వాత ప్రత్యేక హోదా పైన నిలదీశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అక్వా ఫుడ్ పార్క్ పైన స్పందించారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో పర్యటించారు. వీటన్నింటి పైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం గమనార్హం.












Click it and Unblock the Notifications