'రాకేష్ మంచివాడు, శిఖాచౌదరి అతన్ని మార్చేసింది': ఆమెతో ప్రాణహానీ ఉందని చెప్పాడు.. జయరాం భార్య
అమరావతి/హైదరాబాద్: కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డికి నేర చరిత్ర ఉందని పోలీసుల విచారణలో తేలినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, అతని తండ్రి తన కొడుకు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

మంచివాడు, శిఖా చౌదరి మార్చింది
తన కొడుకుకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, జయరాం హత్య కేసులో కావాలనే తన కొడుకును ఇరికించారని ఆయన చెప్పారు. అసలు శిఖా చౌదరి పరిచయం అయిన తర్వాతే తమ వాడిలో మార్పు వచ్చిందని చెప్పారు. రాకేష్ చాలా మంచివాడని, శిఖా చౌదరి కారణంగానే అలా తయారయ్యాడని అభిప్రాయపడ్డారు. ఆమె పరిచయమయ్యాక ఇంటికి రావడం మానివేశాడని, ఆమె తన కొడుకును పూర్తిగా మార్చివేసిందన్నారు.

కుట్ర చేసి ఇరికించారు
హత్యకు గురైన జయరాం తమకు తెలియదని చెప్పారు. జయరాం హత్య కేసులో తమ వాడిపై కుట్ర చేసి ఇరికించారని అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు ఒకరికి సాయం చేస్తాడు కానీ, ఎవరి ప్రాణాలు తీయడని చెప్పారు. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. అసలు శిఖా చౌదరి పరిచయం అయిన విషయే తమకు అంతగా తెలియదని, కానీ ఆమె కలిశాక మార్పు వచ్చిందన్నారు.

జయరాం బంధువులపై అనుమానాలు
మరోవైపు, జయరాం సతీమణి పద్మిని మరో సందర్భంలో మాట్లాడారు. ప్రాణభయం ఉందని 2016 తమకు జయరాం చెప్పాడని అన్నారు. తన భర్తకు బంధువుల నుంచే ప్రమాదం వచ్చిందన్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత ఇంత ఘోరంగా చంపుతారని భావించలేదని చెప్పారు. మీటింగ్స్ కోసమే అమెరికా నుంచి వచ్చాడని చెప్పారు. గతంలో ఎక్స్ప్రెస్ ఛానల్ టీవీ వ్యవహారంలో శిఖాచౌదరి ప్రమేయం ఎక్కువ అయిందని, అందుకే ఆమెను బాధ్యతల నుంచి తొలగించామన్నారు. సొంత అక్కతోనే ప్రాణహానీ ఉందని చెప్పేవాడన్నారు.












Click it and Unblock the Notifications