తెలంగాణపై ఎన్టీఆర్ ఫ్యామిలీ, బాబు సేఫ్సైడ్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ అంశంపై స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబం, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోయింది. ఆయన వర్ధంతి రోజు కూడా పలు అంశాలతో పాటు తెలంగాణ అంశంపై భిన్నంగా స్పందించారు. శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కేంద్రమంత్రి పురందేశ్వరి, మాజీ ఎంపి హరికృష్ణ, హీరో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.
ఈ సమయంలో కుటుంబంలో విభేదాలు మరోసారి కనిపించిన విషయం తెలిసిందే. తెలంగాణ అంశం పైనా వారు భిన్నంగా స్పందించారు. హరికృష్ణ మాట్లాడుతూ.. తాను ఎప్పటికీ సమైక్యవాదినని, ఎన్టీఆర్ జీవించి ఉంటే రాష్ట్ర విభజన జరగకపోయేదన్నారు. తాను ఎన్టీఆర్ దారిలో నడుస్తానని, ఎర్రబెల్లి వంటి వారు తాను తెలంగాణవాదం నుండి సమైక్యవాదం వైపు యూ టర్న్ అయ్యానని చెప్పడం సరికాదని, నిరూపించాలని సవాల్ చేశారు.
ఎర్రబెల్లి మాట్లాడుతూ టిడిపి తెలంగాణకు కట్టుబడి ఉందని, హరికృష్ణ యూ టర్న్ తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ బతికుంటే ఇప్పుడు విభజన జరిగి ఉండేదన్నారు. మరోవైపు దేవినేని ఉమామహేశ్వర రావు, నన్నపనేని రాజకుమారి తదితర సీమాంధ్ర నేతలు మాట్లాడుతూ... ఎన్టీఆర్ సమైక్యాంధ్రవాది అన్నారు. అయితే, చంద్రబాబు మాత్రం వర్ధంతి రోజు ఆచితూచి స్పందించారు. ఎన్టీఆర్ ప్రపంచానికి కొత్త రాజకీయం చూపించారని తనదైన శైలిలో స్పందించారు.

హరికృష్ణ
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ.. తాను సమైక్యవాదినని, తాను ఎప్పుడు తెలంగాణకు మద్దతు పలకలేదని, మద్దతు పలికినట్లుగా ఎవరైనా నిరూపించాలని సవాల్ విసిరారు.

సీమాంధ్ర నేతలు
స్వర్గీయ నందమూరి తారక రామారావు సమైక్యాంధ్రవాది అని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు, పరిటాల సునీత తదితరులు చెప్పారు.

పురంధేశ్వరి
సమైక్యవాది అయిన కేంద్రమంత్రి పురంధేశ్వరి పెద్దగా రాజకీయాలు మాట్లాడలేదు. అయితే, సమైక్యవాది అయిన ఆమె అధిష్టానం నిర్ణయానికి సై అంటున్నారు.

దేవినేనితో దగ్గుబాటి కరచాలనం
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద సీమాంధ్ర టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు, కాంగ్రెసు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావుల కరచాలనం.

సీతక్క, పరిటాల సునిత
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు పరిటాల సునీత, సీతక్కలు.

చంద్రబాబు
చంద్రబాబు మాత్రం వర్ధంతి రోజు ఆచితూచి స్పందించారు. ఎన్టీఆర్ ప్రపంచానికి కొత్త రాజకీయం చూపించారని తనదైన శైలిలో స్పందించారు.

లక్ష్మీ పార్వతి
ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి మొదటి నుండి విభజనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆమె సమైక్యాంధ్రనే కోరుకంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపి హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని, టిడిపికి ప్రచారం చేస్తానని చెప్పారు.

టిటిడిపి నేత ఎర్రబెల్లి
స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణపై పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ వైఖరిని తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications