ఎన్టీఆర్ పేరు మార్పు - జగన్ ట్రాప్ లో టీడీపీ చిక్కిందా : మధ్యలో బాలయ్య - తారక్..!!
ఎన్టీఆర్ పేరు మార్పు వ్యూహాత్మకంగానే జరిగిందా. ఈ నిర్ణయం వెనుక రాజకీయం ఏంటి. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు రాస్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అధికారంలోకి వచ్చిన తరువాత 39 నెలలకు సీఎం జగన్ ఈ ఆకస్మిక నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. ఎన్టీఆర్ పేరు స్థానంలో వైఎస్సార్ పేరు ఖరారు చేసారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదించారు. టీడీపీ నేతలు దీని పైన మండిపడ్డారు. నందమూరి కుటుంబం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. అధికార బాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేసారు. ఎన్టీఆర్ పేరు పైన తనకు గౌరవం ఉందని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇదే విషయంలో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి.

వైసీపీ అధినేత పక్కా వ్యూహాత్మకంగానే
ఎన్టీఆర్ పేరు విజయవాడ జిల్లాకు పెట్టటం ద్వారా జగన్ వ్యక్తిగతంగా చంద్రబాబు పైన ఎన్టీఆర్ విషయంలో పై చేయి సాధించారనే విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్పు ద్వారా ఆ మైలేజ్ డామేజ్ అయిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. కానీ, సీఎం జగన్ రాజకీయంగా పక్క రాజకీయంగా వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్టీఆర్ పేరు తొలిగింపు పైన సహజంగానే టీడీపీ స్పందించింది. అదే సమయంలో సీఎం జగన్ కోరుకున్న విధంగానే ఎన్టీఆర్ వెన్నుపోటు అంశం పైన చర్చ మొదలైంది. వైశ్రాయ్ ఎపిసోడ్ మరోసారి తెర మీదకు వచ్చింది. పదవికి రాజీనామా చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంటి వారు ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా చేసింది చంద్రబాబేనని చెప్పుకొచ్చారు. అదే సమయంలో..టీడీపీ నేతలు ఒక్క రోజులేనే ఈ అంశం పైన చర్చ ముగించారు. అధికారంలోకి రాగానే తిరిగి ఎన్టీఆర్ పేరు తీసుకొస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు. ఆ తరువాత టీడీపీ నేతలు ఈ వ్యవహారం పైన పెద్దగా స్పందించలేదు.

బాలయ్య వ్యాఖ్యలు - వైసీపీ మంత్రుల కౌంటర్
ఇదే సమయంలో బాలక్రిష్ణ సీరియస్ వ్యాఖ్యలు చేసారు. మంత్రులంతా బాలయ్య భుజం పైన తుపాకి పెట్టి.. చంద్రబాబు ను టార్గెట్ చేసారు. వరుసగా మంత్రులంతా వైశ్రాయ్ ఎపిసోడ్ ను పదే పదే ప్రస్తావించి..గతాన్ని గుర్తు చేస్తూ బాలయ్యకు కౌంటర్లు ఇచ్చారు. మంత్రి రోజా నేరుగా బాలయ్యా..మీ తండ్రిని చంపిన వారి పైన పగ తీర్చుకో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇక, జూనియర్ ఎన్టీఆర్ ఈ అంశం పైన స్పందిస్తూ ఎన్టీఆర్ - వైఎస్సార్ ఇద్దరూ ప్రజాదరణ కలిగిన నేతలంగా ఈ వివాదం పైన స్పందించారు. దీని పైన టీడీపీ కార్యకర్తలు - జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. బాలయ్య పేరు మార్పు పైన స్పందించినా..మంత్రులు ప్రశ్నించిన వాటి జోలికి వెళ్లలేదు. సమాధానం ఇవ్వలేదు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీతో..మొత్తంగా రాజకీయంగానే దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు తారక్ పైన వ్యతిరేకంగా కనిపిస్తున్న పోస్టింగ్ లు ఆయన అభిమానులకు రుచించటం లేదు.

చంద్రబాబు టార్గెట్ గా పరిణామాలు
టీడీపీలో ఇలాంటి పరిణామాలనే సహజంగా రాజకీయ ప్రత్యర్ధి అయిన వైసీపీ కోరుకుంటుంది. టీడీపీలో అంతర్గతంగా ఇప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు - జూనియర్ ఎన్టీఆర్ మద్దతు దారులు ఉన్నారనేది వైసీపీ నమ్మకం. చంద్రబాబు నుంచి వారిని దూరం చేయటం వైసీపీ లక్ష్యం. ఇదే సమయంలో 1995 లో ఎన్టీఆర్ ను దించి..చంద్రబాబు సీఎం అయిన ఘటనలను గుర్తు చేస్తూ విజయవాడ కేంద్రంగా పోస్టర్లు కనిపించాయి. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ పోస్టర్లు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. ఒక విధంగా ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్పు వ్యవహారం చంద్రబాబు వైపు మళ్లింది. ఎన్టీఆర్ తో చంద్రబాబు వ్యవహరించిన తీరు పైన అనుకూల - వ్యతిరేక చర్చలు మొదలయ్యాయి. ఈ ఎపిసోడ్ లో సామాజిక సమీకరణాల లెక్కలు మరింత కీలకంగా మారుతున్నాయి. దీంతో..సీఎం జగన్ ట్రాప్ లో టీడీపీ చిక్కిందా..పేరు మార్పు సీఎం జగన్ కు నష్టం చేసిందా అనే చర్చ..ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. రాజకీయంగా ఇదంగా బిగ్ డిబేట్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications