వైసీపీ ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫొటో: టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ, ఉద్రిక్తత
పశ్చిమగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ ఫొటో దర్శనమివ్వడం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఆ ఫ్లెక్సీని చూసిన టీడీపీ కార్యకర్తలు అడ్డుచెప్పడంతో ఇరు వర్గాల మధ్య ఘర్ణణ చోటు చేసుకుంది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పెదవేగి మండలంలోని పెదకమిడి గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పెదకమిడి గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలను వారించి, పరిస్థిని అదుపు చేశారు.
Recommended Video
పెదకమిడి గ్రామంలోని సాయిబాబా ఆలయం సమీపంలో వెలసిన ఈ ఫ్లెక్సీని వైసీపీ కన్వీనర్ అబ్బయ్య ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఫ్లెక్సీలో అటు, ఇటు దివంగత నేతలు ఎన్టీఆర్, వైయస్సార్ ఉండగా వారి మధ్య జగన్, అబ్బయ్య ఫొటోలు ఉన్నాయి. అందులోనే కొడాలి నాని ఫొటో కూడా ఉంది. వివాదానికి దారితీసిన ఈ ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నం చేశారు పోలీసులు.
ప్రొద్దుటూరులోనూ టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ
మున్సిపల్ పార్క్లో నిర్మిస్తున్న నీళ్లట్యాంకు నిర్మాణంపై ప్రొద్దుటూరులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే అక్కడ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని టీడీపీ కౌన్సిలర్స్ ఆరోపించారు.
మున్సిపల్ పార్క్లో నీళ్లట్యాంకు కోసం నిర్మిస్తున్న భవనం వద్ద గతంలో జరిగిన సంఘటనకు సంబంధించి శనివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అధికారులు, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.