స్నేహితుడితో వెళుతున్న నర్సును బెదిరించి అత్యాచారం,రాత్రంతా చిత్రహింసలు
గుంటూరు:ప్రభుత్వం ,పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా కామాంధులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. మృగాళ్లుగా మారుతున్న కొందరు మగాళ్ల కీచకత్వానికి అద్దం పట్టే ఘటన తాజాగా నవ్యాంధ్ర రాజధాని పరిధిలోనే చోటుచేసుకుంది.
విధులు ముగించుకొని స్నేహితుడితో కలసి వెళుతున్న ఒక నర్సును ఇద్దరు దుండగులు అనుసరించి వెళ్లి ఆమె స్నేహితుడిని కొట్టి పంపేయడమే కాకుండా ఆమెపై అత్యాచారం చేశారు. అంతేకాదు రాత్రంతా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడిన ప్రదేశం డిజిపి కార్యాలయానికి దగ్గరలోనే ఉండటం, పైగా ఆ దుండగులు తాము పోలీసులమని చెప్పి వీరిని నిలువరించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే...
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పొలకంపాడుకు చెందిన యువతి గుంటూరు కాకాని రోడ్డులోని ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈమె మేడికొండూరు మండలం మందపాడుకు చెందిన జోసఫ్ తంబిని కొంతకాలంగా ప్రేమిస్తోంది. శుక్రవారం రాత్రి 10గంటలకు విధుల ముగించుకొని ఆస్పత్రి బయటకు వచ్చిన ఆమె తంబి వాహనంపై మంగళగిరి మిద్దె సెంటర్కు వెళ్లింది. అక్కడినుంచి పెదవడ్లపూడి వైపు వెళుతుండగా మరో వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి వీరిని ఆపారు.
ఆ తరువాత వీరిద్దరిని సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి తంబిని కొట్టడంతో అతను అక్కడ నుంచి పరారయ్యాడు. అనంతరం ఆరోజు రాత్రంతా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని...లైంగికంగా వేధిస్తూ చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. మరుసటి రోజు ఉదయం వరకు యువతిని తమ ఆధీనంలోనే ఉంచుకున్న దుండగులు ఆ తరువాత ఆమెని వదిలేసి వెళ్లిపోగా, ఇంటికి చేరుకున్న ఆమె జరిగిన దారుణం గురించి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆమెను గుంటూరు జీజీహెచ్కు ఆమెను తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో బాధితురాలు చికిత్స పొందుతోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టింది...తెలిసిన వ్యక్తులా...లేక దుండగులా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిపై ప్రభుత్వ కఠినమైన చర్యలు తీసుకొవాలని బాధితురాలి కుటుంబసభ్యులు కోరుతున్నారు.