నీలిచిత్రాల పేరుతో డాక్టర్కు నర్సు బెదిరింపు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఓ ప్రైవేటు డాక్టర్ను బెదిరించిన కేసులో నర్సు సహా మరో యువతిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.14 లక్షలు ఇవ్వకపోతే నీలిచిత్రాలు బయటపెడతామని డాక్టర్ను నర్సు బెదిరించినట్లు తెలుస్తోంది.
చేతబడి కలకలం
విజయవాడ: నగరంలోని పటమటలో చేతబడి చేశారంటూ జరిగిన ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. పటమట పంటకాలువ రోడ్డులోని పోస్టల్ కాలనీ జంక్షన్లో రోడ్డుపై పడి వున్న పలు వస్తువులను చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఎవరో తమపై చేతబడి చేయిస్తున్నారంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని శానిటేషన్ సిబ్బందితో రోడ్డును శుభ్రం చేయించారు.
ఏనుగుల బీభత్సం
చిత్తూరు: జిల్లాలోని కుప్పం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గత పది రోజులుగా కుప్పం మండలం ఆవులనత్తం, జుర్రప్పకొటాల, సత్తిచేన్లు ప్రాంతాల్లో వరి, వేరుశెనుగ, కంది, కూరగాయల పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏనుగుల ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుతకుతున్నామని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారుల కిడ్నాప్
చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాని మండలంలో చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపింది. రాయలపేట గ్రామంలో ఏడేళ్ల చిన్నారులు లావణ్య, సంగీత అదృశ్యమయ్యారు. దీంతో ఆందోళన చెందిన చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లావణ్య ఇంట్లో పనిచేస్తున్న జానకిపైనే చిన్నారుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.