పెట్రోల్ ట్యాంకర్ బోల్తా: బిందెలు, క్యాన్లతో పెట్రోల్ కోసం ఎగబడ్డ జనం
అమరావతి: ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోవూరు సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడింది. విజయవాడ నుంచి రేణిగుంటకు వెళ్తున్న వైట్ పెట్రోల్ ట్యాంకర్ నందలకుంట సమీపంలో మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించి 108కు సమాచారమిచ్చిన స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఇది ఇలా ఉంటే ట్యాంకర్ బోల్తా పడిన సమాచారాన్ని తెలుసుకున్న స్థానికులు పెట్రోల్ను బకెట్లు, క్యాన్లలో తీసుకెళ్లేందుకు భారీగా తరలివచ్చారు.
అంతేకాదు చేతుల్లో ఖాళీ బిందెలతో పెద్దవారితో పాటు చిన్నపిల్లలు సైతం పెట్రోల్ ట్యాంకర్ పడిపోయిన ప్రాంతానికి క్యూ కట్టారు. ట్యాంకర్ నుంచి ఒలికిపోతున్న పెట్రోల్ను బిందెలు, క్యాన్లలో నింపుకుని ఇంటికి తీసుకెళ్తున్నారు. పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడినప్పటికీ అక్కడ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.
అయితే ఈ పెట్రోల్ వైట్ పెట్రోల్ అని స్థానికులు చెబుతున్నారు. దీనిని శుద్ధి చేసిన తర్వాతే ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడిన సమాచారాన్ని ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
స్ధానికులు కింద ఒలికిపోయిన పెట్రోల్ను బట్టలతో పిండుకొని మరీ బిందెల్లో నింపుకోవడం అక్కడున్న కొంతమందిని ఆశ్చర్యపరుస్తోంది. అవేమీ పట్టించుకోకుండా బిందెలు, క్యాన్లలో పెట్రోల్ నింపుకుని వెళ్లడంపైనే అక్కడి స్థానికులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది.