సబిత ఇంద్రారెడ్డికి షాక్: గాలి కేసులో సాక్షి కాదు, దోషే
హైదరాబాద్: మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడింది. కాంగ్రెసు ఆమెకు టికెట్ ఇవ్వలేదు. దానికితోడు సిబిఐ ఆమెకు షాక్ ఇచ్చింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె ఓబుళాపురం అక్రమ గనుల కేసులోనూ నిందితురాలిగా మారారు.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ)కి ఇనుప ఖనిజం గనులను లీజుకు ఇచ్చిన వ్యవహారంలో ఇప్పటి వరకు సాక్షిగా మాత్రమే ఉన్న సబితను సిబిఐ ఇప్పుడు నిందితురాలిగా చేర్చింది. ఓఎంసి కేసులో దర్యాప్తు ముగిసినట్లు గతనెల 30 సిబిఐ అధికారులు సుప్రీం కోర్టుకు నివేదించారు.
ఈ కేసులో తుది చార్జిషీటును నాంపల్లి సిబిఐ ప్రధాన కోర్టులో దాఖలు చేసేందుకు రంగం సిబిఐ సిద్ధం చేసింది. ఇందులో సబితను నిందితురాలిగా చేర్చింది. ఆమెతోపాటు గనులశాఖ మాజీ కార్యదర్శి కృపానందంపైనా అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది. దీనిపై మెమో దాఖలు చేసినట్లు తెలిసింది.
సబితా ఇంద్రారెడ్డి 2004-2009 వరకు గనుల శాఖ మంత్రిగా కొనసాగారు. ఒఎంసి గనుల లీజు మంజూరు చేస్తూ 2007 జూన్ 18న జీవో నెం బర్ 151, 152 జారీ అయ్యాయి. అదే సమయంలో గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి మైనింగ్ లీజులు ఇవ్వడంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిబిఐ పలు అభియోగాలు చేసింది. శ్రీలక్ష్మికంటే ముందు గనుల శాఖ కార్యదర్శిగా కృపానందం వ్యవహరించారు. ఒఎంసి లీజుల మంజూరు కసరత్తు ప్రారంభమైంది.
అనారోగ్యం నేపథ్యంలో గత ఏడాది మార్చి 30న శ్రీలక్ష్మికి కోర్టు మధ్యంతర బెయిలు జారీ చేసింది. ఇప్పటికీ ఆమె బెయిలుపైనే ఉన్నారు. సబితను ఏ8గా పేర్కొనే అవకాశం ఉంది. కృపానందంను ఏ9గా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే సీబీఐ ఈ కేసులో ఆఖరి చార్జిషీటు దాఖలు చేసే అవకాశముంది.