సీన్ రివర్స్: సీబీఐ వాదనకు మద్దతుగా టీడీపీ: ప్రధానితో భేటీపైన అదే వాదన..!
ఏపీలో మరోసారి సీబీఐ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. సీబీఐకు కేంద్రం చేతిలో కీలు బొమ్మగా మారిందంటూ ఏపీలో అనుమతి నిరాకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ తాను ప్రతీ వారం కోర్టుకు హాజరు కాలేనని అందుకు కారణాలు చెబుతూ.. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసారు. దీని పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దీంతో..ఇప్పుడు వాయిస్ మార్చేసింది.
సీబీఐ వాదనకు మద్దతు పలుకుతూ టీడీపీ నేతలు మీడియా ముందుకొచ్చారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్ గతంలో ప్రధానిని కలవగానే కేసుల నుండి బయటపడేయాలని కోరారని ఆరోపించారు. ఇప్పుడు తిరిగి అదే తరహాలో విమర్శలు చేస్తున్నారు. సీబీఐ కేసుల్ని ప్రభావితం చేసేందుకే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తున్నారంటూ ఆరోపణలు మొదలు పెట్టారు. దీంతో..మరోసారి సీబీఐ చుట్టూ ఏపీలో రాజకీయాలు మళ్లీ మొదలయినట్లు కనిపిస్తోంది.

సీబీఐ కేసుల్ని ప్రభావితం చేసేందుకే
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన..ప్రధానితో భేటీ పైన టీడీపీ కీలక వ్యాఖ్యలు చేస్తోంది. గతంలో సీబీఐ నమ్మకం పోగొట్టుకుందని చెప్పుకొచ్చిన టీడీపీ..ఇప్పుడు జగన్ కోర్టుకు హాజరు కాలేనంటూ చేస్తున్న అభ్యర్దన మీద అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని కోసం సీబీఐ 14 పేజీల కౌంటర్ దాఖలు చేసింది. ఇప్పుడు టీడీపీ అందులోని అంశాలనే ప్రస్తావిస్తోంది. దీని పైన వైసీపీ సైతం రియాక్ట్ అవుతోంది.
గతంలో సీబీఐ పని తీరు మీద విమర్శలు చేసి..ఏపీలోకి ఎంట్రీ లేదంటూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు సీబీఐ చేసిన వాదన కోర్టులో తేలుతుందని..టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారని ప్రశ్నిస్తున్నారు. కోర్టులో సీబీఐ చెప్పినట్టుగా జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఆరోపించారు. సహచర నిందితులకు టీటీడీ పదవులు కట్టబెట్టారని, జడ్జీలు కూడా ఆశ్చర్యపోయేంత అవినీతి చేసి తమపై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. చిదంబరం బెయిల్కు జగన్ కేసుల్ని ఉదాహరణలుగా చెబుతున్నారని పంచుమర్తి వ్యాఖ్యానించారు.
ప్రధాని పైన వ్యాఖ్యలతో ఇరకాటంలో..
సీబీఐ కేసుల్ని ప్రభావితం చేసేందుకే ముఖ్యమంత్రి జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుస్తున్నారని టీడీపీ చేసిన విమర్శల పైన కొత్త చర్చ మొదలైంది. ప్రధానితో భేటీ ఒక ముఖ్యమంత్రి హోదాలో జరుగుతోందని..కానీ టీడీపీ నేతలు కేసులను ప్రభావితం కోసం ప్రధానిని కలుస్తున్నారని వ్యాఖ్యానించటం సరి కాదని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే..టీడీపీ మాత్రం బీజేపీ అగ్రనేతలను జగన్ కలిసిన ప్రతిసారీ ప్రజల్లో ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని, ప్రజల అనుమానాలు బీజేపీ నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. దీంతో.. ఇప్పుడు ఈ వ్యవహారం టీడీపీ వర్సెస వైసీపీ గా మాత్రమే కాకుండా బీజేపీ నేతలు సైతం రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కోర్టుకు హాజరు కాకుండా అనుమతి ఇవ్వాలా లేదా అనేది కోర్టు పరిధిలోని అంశమని...దానికి ప్రధానితో భేటీకి సంబంధం ఏంటనేది ఆ పార్టీ నేతల ప్రశ్న. అయిదో తేదీన ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన పూర్తయ్యే వరకూ ఈ చర్చ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications