గంజాయి కేసులో వైసిపి నేత అరెస్ట్: వర్షాలతో వజ్రాల వేట.. జనం క్యూ
విశాఖ: గంజాయి కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిగా తెలుస్తోంది. అరెస్టైన వ్యక్తి మాడుగుల జెడ్పీటీసీ భర్త, వైసిపి నేత సంజీవ్ రావు.
విజయనగరం జిల్లాలో 102 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాలూరు మండలం జిగిరాం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంటోంది. ఇప్పటి దాకా నీళ్లు లేక కళ తప్పిన జలాశయంలోకి క్రమంగా వరద నీరు వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 95,840 క్యూసెక్కులు ఉంది.
ముగ్గురు కార్మికుల మృతి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టు పారిశ్రామికవాడలో విషాదం చోటుచేసుకుంది. ఇండస్ కాఫీ పరిశ్రమలో పని చేస్తున్న నలుగురు కార్మికులు పరిశ్రమలోని ట్యాంకులోకి దిగి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
వజ్రాల వేట.. క్యూ కడుతున్న ప్రజలు
కర్నూలు జిల్లాలో వజ్రాల వేట సాగుతోంది. జిల్లాలోని ప్యాపిలి మండలం ఎస్ రంగాపురం గ్రామ పరిధిలోని పొలాల్లో జనం తండోపతండాలుగా కనిపిస్తున్నారు. ఆ గ్రామవాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో జనం పొలాల వద్దకు క్యూ కడుతున్నారు.
వర్షాలు కురవగానే ఇక్కడి పొలాల్లో నేలపై ఉన్న మట్టి కొట్టుకుపోయి వజ్రాలు బయటపడతాయి. వీటిని చేజిక్కించుకునేందుకు జనం వజ్రాల వేట సాగిస్తుండటం ఏటా జరుగుతుంటుందని అంటున్నారు. జనం చీకటి పడే దాకా వజ్రాల వేటలోనే లీనమైపోతారు. గడచిన నాలుగు నెలల్లోనే ఇక్కడ దాదాపు కొన్ని వజ్రాలు లభ్యమైనట్లుగా చెబుతుంటారు.