ఒన్ షాట్.. త్రీ బర్డ్స్..! గురి తప్పితే ప్రమాదమే..! ఏపి ప్రజానికానికి చంద్రబాబు ఫైనల్ కాల్..!!
అమరావతి : 2019 ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పలు రాజకీయ పార్టీలు తమ చివరి మాటను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని, ప్రజలు విజ్నతతో ఓటు హక్కును వినియోగించుకోవాలని టీడీపీ నాయకులు చంద్రబాబు పిలుపునిచ్చారు. మీరు వేసే ప్రతి ఓటు భావితరాల భవిష్యత్తుకు పునాది రాళ్లవుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలంతా టిడిపికే ఏకపక్ష మద్దతు ఇచ్చేందుకు మొగ్గు చూపాలని కోరారు బాబు.
తుది అంకానికి చేరుకున్న ప్రచారం..! ప్రజలను ఒప్పించే క్రమంలో నేతల పాట్లు..!!
సాయంత్రం 6గం దాకా ప్రచారం ఉధృతంగా చేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాబోయే 2రోజులు అవిశ్రాంతంగా పనిచేయాలని చెప్పారు. దొంగదెబ్బలు తీయడం దుర్మార్గులకు అలవాటు అన్నారు. అవినీతి సొమ్ములు వైసిపి వెదజల్లుతోందని. బౌతిక దాడులకు కూడా తెగబడుతోందని బాబు ఆరోపించారు. బెదిరింపులు, వేధింపులతో భయపెడుతోందన్నారు. దేశం అంతా మోదీ వ్యతిరేక గాలి వీస్తోందని, కడుపు నిండా ద్వేషం నింపుకున్న వ్యక్తి కేసిఆర్ అని విమర్శించారు.
ఒక్క అవకాశం అంటున్న ప్రతిపక్షాలు..! అనుభవానికే పట్టం కట్టాలంటున్న టీడిపి..!!
ప్రజాబలం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందేనని బాబు పేర్కొన్నారు. నరేంద్రమోది అయినా, షా-జగన్ ల కైనా ప్రజాతీర్పే ప్రామాణికమని తెలిపారు. అన్ని సర్వేలు టిడిపికే ప్రజాతీర్పు అనుకూలమని చెప్పాయని, ప్రభుత్వ పనితీరుపై, సంక్షేమ పథకాలపై పూర్తి సానుకూలత ఉందన్నారు. ఓటమి ముందే ఖరారు కావడంతో వైసీపీ బెంబేలెత్తిపోతోందని విమర్శించారు. ఎన్నివిధాలా అరాచకాలకైనా బరితెగించిందని బాబు మండి పడ్డారు. ఓట్లను తొలగించే కుట్ర చేద్దామని చూసి జగన్ భంగపడ్డాడని, టిడిపి సేవామిత్ర యాప్ పై కెసిఆర్ దాడి జగన్ కోసమేనని బాబు ఫైర్ అయ్యారు.
అందరూ కుట్రలు చేసారు..! అప్రమత్తంగా ఉండాలంటున్న బాబు..!!
ముగ్గురూ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలే. ఏపికి హోదాను తెలంగాణ ఎన్నికల్లో కెసిఆర్ వ్యతిరేకించారు. ఏపి అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ కోసమే కెసిఆర్ హోదా డ్రామా. టిడిపిని నిర్వీర్యం చేయడం, వైసిపిని స్వేచ్ఛగా వదిలేయడం ప్రజలే చూశారు. కెసిఆర్ నిజ స్వరూపం ఆయనే బైట పెట్టుకున్నాడు. జగన్ తో కుమ్మక్కు రాజకీయాలను, లాలూచిని కెసిఆరే వెల్లడించాడు. తన మనసులో టిడిపిపై అక్కసంతా కెసిఆర్ బైటపెట్టాడు. జగన్ పట్ల తనకున్న మోజును కెసిఆర్ వెల్లడించాడని చంద్రబాబు ఆరోపించారు.
భవిష్యత్ తరాలను ద్రుష్టిలో ఉంచుకుని ఓటేయాలని పిలుపు..! ప్రచారం ముగించిన అన్ని పార్టీలు..!!
కేసిఆర్, రాం మాధవ్, జగన్ వ్యాఖ్యలే ఆ 3పార్టీల కుమ్ముక్కు రాజకీయాలకు రుజువని బాబు తెలిపారు. ఆంధ్రా బాగుండాలని ఉంటే కెసిఆర్ అఫిడవిట్లు వేస్తారా..? కృష్ణాపై 9ప్రాజెక్టులు, గోదావరిపై 4ప్రాజెక్టులు అడ్డుకుంటారా..? పోలవరంపై డీమ్డ్ టు అప్రూవల్ అని చట్టంలో ఉంది. మరి పోలవరం పై ఎందుకు కేసిఆర్ అన్ని కేసులు వేశారని ప్రశ్నించారు. ఏపి ప్రాజెక్టులను అడ్డుకుంటావు, జగన్ గెలవాలంటావు. టిఆర్ఎస్, వైసిపి లాలూచికి కేసిఆర్ వ్యాఖ్యలే రుజువని అన్నారు. జగన్ ను ఓడిస్తేనే కెసిఆర్ కు గుణపాఠం అవుతుందని బాబు తెలిపారు.