తెలంగాణలో కెసిఆర్ ఒక్కరే కోటీశ్వరుడు: లోకేష్ ఎద్దేవా
హైదరాబాద్: తెలంగాణలో అత్యంత ధనవంతుడైన రైతు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. కాంగ్రెసు పార్టీ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో కోటీశ్వరుడైన రైతు కెసిఆర్ ఒక్కరే అన్నారు.
కెసిఆర్ మూడు రోజుల క్రితం విలేకరులను తీసుకు వెళ్లి తన ఫాంహౌస్, అక్కడ పండిస్తున్న పంటలను చూపించిన విషయం తెలిసిందే. కోట్లాది రూపాయల విలువైన పంట వస్తుందని కెసిఆర్ చెప్పడంపై చంద్రబాబు కూడా శనివారం విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
కెసిఆర్కు రైతులందరి భూములు ఇచ్చి ఎకరాకు రూ.5 లక్షల ఆదాయం తీసుకోవాలని చెప్పారు. కెసిఆర్ తన పద్ధతిలో వ్యవసాయం చేసి ఎకరాకు రూ.5 లక్షల చొప్పున రైతులకిచ్చి మిగతా 95లక్షల రూపాయలు తీసుకోవాలని అన్నారు. ఈ విధంగా చేస్తే రాష్ట్రంలోని రైతులు బాగుపడతారని చెప్పారు. కెసిఆర్ చెప్పినంత మాత్రాన ఎకరాకు కోటి రూపాయల ఆదాయం వస్తుందని ఏ మాత్రం ఆలోచించకుండా రాసేస్తారా? అని మీడియా ప్రతినిధులను ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ప్రాంతంలో రైతులంతా గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. కెసిఆర్ మాత్రం లాభపడ్డానని చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. ఇదంతా నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకునే ప్రక్రియలో భాగమేనని చంద్రబాబు ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడైనా ఎకరానికి కోటి రూపాయల ఆదాయం వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. అమెరికా, ఆస్ట్రేలియాలో వ్యవసాయం చేసినా అంత రాదని తెలిపారు. ఎక్కడెక్కడో సంపాదించిన సొమ్మునంతా అక్కడ పోసి ఏరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ తన ఫాంహౌజ్లో చేస్తోంది వ్యవసాయం కాదని, అవినీతి సాగేనని ఆరోపించారు.