ఏం జరిగినా స్పందించేది జగన్ ఒక్కడే: వైయస్ జగన్
అనంతపురం: రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించేది జగన్ ఒక్కడేననే విషయం ప్రజలందరికీ తెలుసునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్ర శనివారంనాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పి.కొత్తపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు లక్ష్మణ్న కుటుంబాన్ని ఆయన ఈ సందర్భంగా పరామర్శించారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదనీ సుఖశాంతులతో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. పి. కొత్తపల్లి గ్రామంలో రైతు లక్ష్మణ్న ఆత్మహత్య చేసుకుని ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్కరూ పరామర్శించలేదని ఆయన గుర్తు చేశారు.
ఒక్క పైసా సాయం కూడా లక్ష్మణ్మ కుటుంబానికి చేయలేదని, ఆయనకు ర.1.19 లక్షల అప్పు ఉందని, 19 వేల రూపాయలు మాఫీ అయిందని, రూ.20 వేల వడ్డీ భారం పడిందని జగన్ చెబుతూ ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఆర్థిక సాయం లక్ష్మణ్న కుటుంబానికి ఎందుకు అందించలేదని ప్రశ్నించారు.
వడ్డీకి కూడా సిరిపోని విధంగా ప్రభుత్వం రుణ మాఫీ అమలు చేస్తోందని, రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులపై 14 శాతం అపరాధ రుసుం పడుతోందని, రైతులు తాకట్టు పట్టిన బంగారం బ్యాంకుల్లోనే ఉందని ఆయన అన్నారు.
హంద్రీ - నీవా ప్రాజెక్టుపై చంద్రబాబుది ప్రచార ఆర్భాటం మాత్రమేనని, వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో హంద్రీ నీవా ప్రాజెక్టు పనులు 85 శాతం పూర్తయ్యాయని ఆయన అన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టును తానే పూర్తి చేశానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని, రుణమాఫీపై రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆయన అన్నారు.