ఆపరేషన్ ఆకర్ష్: చంద్రబాబు తదుపరి టార్గెట్ ఏ జిల్లా?
అమరావతి: ఏపీలో తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ఊపందుకుంది. ఇప్పటికే వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీలోకి చేరారు. ఈ వలసలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. మంగళవారం జరిగిన వలసలు రాయలసీమ ప్రాంతానికి చెందినవి కాగా, రాష్ట్రంలోని మిగతా జిల్లాల నుంచి కూడా ఈ అవకాశం కోసం వైసీపీ నేతలు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
తొలివిడతలో భాగంగా రాయలసీమపై దృష్టిపెట్టిన చంద్రబాబు రెండోవిడతలో ఉత్తరాంధ్రపై దృష్టిసారించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో కీలకంగా ఉన్న విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల బాధ్యతలు చూస్తున్న బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
విజయనగరం జిల్లాకు చెంది గతంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరడంతో సుజయ కృష్ణ రంగారావు కాస్తంత ఇబ్బంది గురవుతున్నారు. అప్పట్లో ఆయన పార్టీని వీడతారనే వార్తలు మీడియాలో వచ్చాయి.
అయితే పార్టీ అధినేత వైయస్ జగన్ బుజ్జగించడంతో అప్పట్లో ఆయన వెనక్కి తగ్గారు. అయితే టీడీపీలో చేరే విషయమై ఆయన మంగళవారం స్పందించారు. గత ఎన్నికల్లో దివంగత నేత వైయస్ బొమ్మతో విజయం సాధించామని, ప్రాణమున్నంతవరకూ తాము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తామని స్పష్టం చేశారు.
కెసిఆర్ బాటలో బాబు: ప్రాణమున్నంత వరకూ జగన్తోనేనన్న సుజయ
ఇక విశాఖపట్నం విషయానికి వస్తే వైసీపీ నుంచి చాలా క్రితమే బయటకు వచ్చిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరడానికి ఇంతకు ముందే రంగం సిద్ధం చేసుకున్నారు. ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. కొణతాల టీడీపీలోకి వస్తే విశాఖపట్నంలో కాస్తంత పట్టు సాధించవచ్చనేది చంద్రబాబు ఆలోచన.
కొణతాల రామకృష్ణతోపాటు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూడా పార్టీలోకి వస్తున్నారు. అయితే ఇందుకు పెందుర్తి ఎమ్మెల్యే బండారు వ్యతిరేకిస్తున్నారు. అతను(బాబ్జీ) ఎమ్మెల్యేగా వున్నపుడు టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని, ఇప్పుడు ఎలా కలిసి పనిచేస్తామని ప్రశ్నిస్తున్నారు.
ఏం చేసిన పార్టీ కోసమేనని, అదంతా అధిష్టానం చూసుకుంటుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు వీరిద్దరికి సర్ది చెబుతున్నట్లు సమాచారం. మరోవైపు విశాఖ జిల్లా వరకు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీలోకి వెళ్లడానికి ప్రస్తుతానికి ఆసక్తి చూపకపోయినా, పార్టీకి మాత్రం నష్టం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.