Opinion: ఏపీలో షర్మిలకు షాక్.. వైసీపీ వైపు వైయస్ సన్నిహితులు ..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్కు దివంగత మాజీ ముఖ్యమంత్రి చికిత్స చేసి తిరిగి జీవం పోశారు.2004లో అఖండ మెజార్టీతో ఒంటరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు వైయస్. కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వచ్చిందంటే అది వైయస్సార్ పుణ్యమే అని ఇప్పటికీ కాంగ్రెస్ పెద్దలు చెబుతుంటారు. ఇక 2009లో ఓవైపు టీడీపీ మరోవైపు చిరంజీవి ప్రజారాజ్యంను ధీటుగా ఎదుర్కొని తిరిగి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు వైయస్. మరో దశాబ్దకాలం పాటు కాంగ్రెస్కు తిరుగులేదు అన్న రీతిలో ఇమేజ్ క్రియేట్ అయ్యింది. అయితే రెండవ సారి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే విధి చిన్న చూపు చూడటంతో వైయస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మళ్లీ గ్రూపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి.. క్రమంగా పార్టీ పరిస్థితి కూడా దయనీయ పరిస్థితిని ఎదుర్కొంది.
ఉమ్మడి ఏపీలో పట్టుకోల్పోయిన కాంగ్రెస్
సరిగ్గా అదే సమయంలో ప్రత్యేక తెలంగాణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో పెద్ద ఉద్యమం ప్రారంభమైంది.ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో మరింత బలహీనపడింది. మరోవైపు వైయస్ కుమారుడు వైయస్ జగన్ ప్రత్యామ్నాయ శక్తిగా లేదా మరో పవర్ హౌజ్గా ఎదగకుండా కాంగ్రెస్ పార్టీకే చెందిన కొందరు వ్యక్తులు ఢిల్లీ స్థాయిలో కుట్రలు చేశారనే అభిప్రాయం ఉంది. ఇప్పటికీ కొంతమంది కాంగ్రెస్ నేతలు ఈ విషయం గురించి అక్కడక్కడా గుర్తుచేస్తుంటారు. వైయస్ మరణంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిలకు పార్టీ మీద పట్టు ఏమాత్రం సాధించలేకపోయారు.దీంతో కేసీఆర్ మరింత బలోపేతంగా తయారయ్యారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడటంతో నాటి యూపీఏ ప్రభుత్వం 2014లో ఆంధ్రప్రదేశ్ను రెండుగా విభజించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారం తెలిపింది.

ఏపీలో పని చేయని షర్మిలా ఫార్ములా
తెలంగాణ ముఖ్యమంత్రిగా 2014లో కేసీఆర్ బాధ్యతలు చేపడితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ క్యాడర్ మొత్తం జగన్ పెట్టిన వైసీపీ వైపు మరలింది. ఏపీలో వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు హైకమాండ్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా పలువురు నేతలను పీసీసీ అధ్యక్షులుగా చేసింది కానీ ఎవరూ ఎలాంటి ఫలితం చూపించలేకపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేటికీ మరణశయ్యపై ఊగిసలాడుతోంది.ఇక ఇదంతా కాదని భావించిన కాంగ్రెస్ అధినాయకత్వం 2024లో వైయస్ గారాలపట్టి వైయస్ షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించింది. అయితే షర్మిలతో కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందని భావించిన కార్యకర్తకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. షర్మిలా నేతృత్వంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది.
తలనొప్పిగా మారిన షర్మిలా వ్యవహారం
మరోవైపు తన అన్న వైయస్ జగన్ కూడా 11 సీట్లకే పరిమితమయ్యాడు. అయితే దీన్నే అవకాశంగా మలుచుకుని షర్మిలా కాంగ్రెస్ను గాడిలోపెట్టి బలోపేతం చేస్తుందని హైకమాండ్ భావించింది.అయితే షర్మిలా నాయకత్వంలో అది సాధ్యపడలేదనే భావన అందరిలో కలుగుతోంది. షర్మిలాలో నాయకత్వ లక్షణాలు కనిపించడం లేదని, సరైన విజన్ లేదనే మాట కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తోంది. అన్నతో విబేధాల కారణంగానే తెలంగాణలో వైయస్సార్టీపీ పార్టీ పెట్టి దాన్ని నడపలేక మూసేసి ఆపై కాంగ్రెస్లో చేరి పీసీసీ ,చీఫ్ పదవి తెచ్చుకుందనే ప్రచారం ఉంది. పీసీసీ అధ్యక్షురాలిగా పార్టీ కంటే సొంత అజెండాతోనే ఆమె ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. అన్నపై కోపంతో కొన్ని అంశాల్లో కూటమి ప్రభుత్వాన్ని సమర్థించడాన్ని కాంగ్రెస్ పెద్దలు తప్పుపడుతున్నారు. ఇక పార్టీ పరంగా చేయాల్సిన పోరాటాలకంటే అన్నపైనే వ్యక్తిగత పోరాటం చేయడాన్ని, కుటుంబ సమస్యను రోడ్డుపైకి తీసుకొచ్చి సింపథీ పొందడాన్ని తప్పుబడుతున్నారు.దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం చేకూరదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ వైపు రాయలసీమ కాంగ్రెస్ నేతలు..?
షర్మిలా పగ్గాలు చేపట్టాక ఆమె ధోరణి నచ్చక చాలామంది కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె సీనియర్లను కలుపుకుని పోవడం లేదని, ఒంటెద్దు పోకడలకు పోతోందని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఒకప్పుడు తన తండ్రి వైయస్సార్కు చాలా దగ్గర సన్నిహితులు కూడా షర్మిలను దూరం పెడుతున్నారు. వారంతా ప్రత్యామ్నాయ పార్టీలకు వెళ్లేందుకు మార్గం సుగుమం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి బలంగా ఉండటంతో అక్కడికి వెళ్లినా.. వీరికి సరైన గుర్తింపు ఉండదనే భావన వీరిలో ఉంది. దీంతో ఈ కాంగ్రెస్ అసంతృప్తులంతా వైసీపీ వైపు చూస్తునట్లు సమాచారం. ఇది ఒక రకంగా వైసీపీ అధినేత జగన్కు శుభపరిణామం అనే చెప్పాలి. ముఖ్యంగా వైసీపీకి కంచుకోటగా నిలిచిన రాయలసీమలో తిరిగి తమ కోటను ఈ కాంగ్రెస్ సీనియర్ల ద్వారా పునర్నిర్మించుకునేందుకు చక్కటి అవకాశంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications