సీఎం జగన్ 2024 తారక మంత్రం - టీడీపీ మిడిల్ డ్రాప్: వైసీపీ గర్జిస్తోంది..!!
CM Jagan Decisions: ఏపీలో ఎన్నికల వేడి ముందస్తుగానే మొదలైంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ రాజకీయ వ్యూహాలు వేగంగా అమలు చేస్తున్నారు. వై నాట్ 175 ఇప్పుడు సీఎం జగన్ నినాదం. ఇదే సమయంలో ప్రతిపక్షాలు ఎక్కడా అవకాశం లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి లక్ష్యం. అదే సమయంలో ప్రజలకు పాలన చేరువ చేసే నిర్ణయాలతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అన్ని ఇంటికే అందించే ఏర్పాటు చేసారు. కొత్త జిల్లాల ఏర్పాటు..ఇప్పుడు మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ వచ్చిన టీడీపీలో ఇప్పుడు మౌనం కనిపిస్తోంది.దీంతో, ఇప్పుడు ఈ పరిపాలనా వికేంద్రీకరణ సీఎం జగన్ తారక మంత్రంగా మారుతోంది.
అమరావతికి వ్యతిరేకం కాదంటూ...
ముఖ్యమంత్రి జగన్ ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన వెనుక భారీ కసరత్తు చేసినట్లే కనిపిస్తోంది. రాజకీయంగా అనేక వ్యూహాలు ఇందులో ఉన్నా..ప్రజలను ఈ అంశంలో కనెక్ట్ చేసే విధంగా ముఖ్యమంత్రి అడుగులు కనిపిస్తున్నాయి. అభివృద్ధికి దూరంగా ఉన్న ఉత్తరాంధ్ర - రాయలసీమ ప్రాంతాల్లోనూ రాజధానులు అవసరమే ఆలోచన తెర మీదకు తెచ్చారు. అమరావతి ఒక్కటే రాజధాని అయితే, అక్కడే లక్ష కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని, ఏపీ ఆర్దిక కష్టాల్లో అది సాధ్యం కాదని అసెంబ్లీ వేదికగా తేల్చారు. అమరావతికి తాను వ్యతిరేకం కాదని చెబుతూనే..అమరావతిలో శాసన రాజధాని ప్రతిపాదించారు. అక్కడ భూ సమీకరణ సమయంలో జరిగిన ప్రతీ ఒప్పందం అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో మిగిలిన రెండు రీజియన్లలో కూడా అభివృద్ధి అవసరమని స్పష్టం చేస్తోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి.
సచివాలయాలు టు రాజధానులు..
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత వెంటనే వార్డు- గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అనేక సేవలు సచివాలయా ల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పాటు చేసారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో సహా కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. అదే విధంగా 13 జిల్లాలుగా ఉన్న ఏపీ ఇప్పుడు 26 జిల్లాలు అయింది. అదే సమయంలో పరిపాలనా - న్యాయ - శాసన రాజధానులుగా విశాఖ..కర్నూలు- అమరావతిని ప్రతిపాదించారు. న్యాయ సంబంధిత అంశాలతో ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీం తో ఈ కేసు తేలిన తరువాత ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల వ్యవహారంలో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో విశాఖలో పరిపాలనా రాజధాని..కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు అమలు కోరుతూ ఆ ప్రాంతాల్లో గర్జనలు జరుగుతున్నాయి.
సడన్ గా సైలెంట్ అయిన టీడీపీ..
విశాఖలో పరిపాలనా రాజధాని డిమాండ్ తో జేఏసీ గర్జన నిర్వహించింది. వైసీపీ మద్దతు ప్రకటించింది. ఆ సమయంలో రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. పోటీగా టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు.. సేవ్ విశాఖ పేరుతో కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా..సుప్రీం కోర్టులో వచ్చిన మధ్యంతర ఉత్తర్వుల తరువాత టీడీపీ నుంచి మూడు రాజధానుల పైన స్పందన లేదు. ప్రస్తుతం కర్నూలు వేదికగా న్యాయ రాజధాని డిమాండ్ చేస్తూ గర్జన సాగుతోంది. 1937 పెద్ద మనుషుల ఒప్పదంలో రాజధాని లేదంటే హైకోర్టు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 2019 ఎన్నికల్లో సీమలోని నాలుగు జిల్లాలో వైసీపీ 49 సీట్లు గెలవగా.. టీడీపీ 3 సీట్లు గెలిచింది. తాజాగా కర్నూలు జిల్లా పర్యటన సమయంలో చంద్రబాబు మూడు రాజధానుల పైన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి. కానీ, కర్నూలు గర్జన పైన టీడీపీ ఎక్కడా వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం లేదు. దీంతో, మూడు రాజధానుల విషయంలో వైసీపీ గర్జనలతో ముందుకెళ్తోంది. సుప్రీంకోర్టు తుది తీర్పు తరువాత ఏపీలో ఈ మూడు రాజధానుల వ్యవహారం ఏ టర్న్ తీసుకుంటుందనేది స్పష్టత రానుంది.