22న ఓకే వేదికపైకి: టీడీపీ యూపీఏలో చేరినట్లేనా అంటే.., మాతో చంద్రబాబు ఎందుకు కలిశారంటే: గెహ్లాట్
అమరావతి: ఈ నెల 22వ తేదీన బీజేపీని వ్యతిరేకించే పార్టీలు అన్నీ కలుసుకోవాలనే ఆలోచనలో ఉన్నామని, ఈ మేరకు అందరితో మాట్లాడుతున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ఆయనతో భేటీ అయ్యారు. వారు గంటపాటు చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఢిల్లీ వేదికగా బీజేపీయేతర పార్టీలు సమావేశం కాబోతున్నాయని, అదే అంశంపై చంద్రబాబుతో మాట్లాడేందుకు వచ్చానని గెహ్లాట్ చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆ పార్టీపై అజెండా రూపకల్పన, భవిష్యత్తు కార్యాచరణ, కూటమి సంస్థాగత నిర్మాణంపై ఈ నెల 22న పార్టీలు చర్చించనున్నాయి.
కాంగ్రెస్ ఆహ్వానిస్తోందీ, నేనూ అదే చేస్తా
కాంగ్రెస్ ఆహ్వానం పలుకుతోందని, నేను కూడా పంపిస్తానని, అందరం కలిసి చర్చించుకుంటామని, ఈ వేదికను ఎలా ముందుకు తీసుకు వెళ్లాలి, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలనే అంశాలపై చర్చిస్తామని చంద్రబాబు చెప్పారు. నోట్ల రద్దు, స్కాంలు, వ్యవస్థల దుర్వినియోగంపై మాట్లాడుతామన్నారు. తొలుత బీజేపీయేతర పార్టీలపై దృష్టి సారిస్తామని, ఇప్పటికే తాను రాహుల్ గాంధీ, ములాయం సింగ్, అఖిలేష్, ఫరూక్ అబ్దుల్లా, మాయావతి, శరద్ యాదవ్, సురవరం, శరద్ పవార్, స్టాలిన్, కుమారస్వామి, దేవేగౌడ తదితరులను నేరుగా కలిశానని, మమత బెనర్జీతో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. 19 లేదా 20న మమతను కలుస్తానన్నారు.
మూడుదశల్లో కూటమి
బీజేపీయేతర కూటమిలో మూడు దశల్లో పార్టీలు జట్టు కడతాయని చంద్రబాబు చెప్పారు. తొలుత ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు కొన్ని పార్టీలు కలుస్తాయని, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల ముందు కొన్ని పార్టీలు చేరుతాయన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత వచ్చి చేరే పార్టీలు కూడా ఉంటాయని తెలిపారు. తమ కలయిక రాజకీయ అవసరాల కోసం కాదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకే అన్నారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ఆ పార్టీ కూడా భాగస్వామ్యం అవుతోందన్నారు. శివసేన, బీజేడీలను కలుపుకొని వెళ్లడంపై స్పందిస్తూ.. తొలుత బీజేపీయేతర పార్టీలు కలుస్తాయన్నారు. తాను కలిసిన నాయకులంతా ఈ నెల 22న వచ్చేందుకు అంగీకరించారన్నారు. కలిసి రావడంపై మజ్లిస్ నిర్ణయించుకోవాలన్నారు.
యూపీఏలో చేరినట్లేనా అంటే చంద్రబాబు సమాధానం ఇదీ
ప్రస్తుతం దేశంలో బీజేపీ అనుకూల, బీజేపీ వ్యతిరేక వేదికలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. బీజేపీ వ్యతిరేక వేదికలోకి రాని పార్టీ ఏది అయినా కమలం పార్టీకి మద్దతిస్తున్నట్లేనని వింత వ్యాఖ్యలు చేశారు. (రెండు పార్టీలను గట్టిగా వ్యతిరేకించే వారు ఉంటారనే అంశాన్ని చంద్రబాబు మరిచినట్లున్నారని అంటున్నారు.) ఏపీ కోసం టీడీపీ చేస్తున్న ధర్మపోరాట దీక్షలో రాహుల్ గాంధీ పాల్గొంటారా అంటే అవి ఊహాగానాలు అన్నారు. యూపీఏలో చేరుతున్నట్లేనా అని మీడియా అడగగా.. కొన్ని పార్టీలు యూపీఏలో ఉన్నాయని, మరికొన్ని పార్టీలు స్వతంత్రంగా ఉన్నాయని, ఎవరు ఎక్కడ ఉంటారనేది విషయం కాదని, ఇది బీజేపీ వ్యతిరేక కూటమి అన్నారు.
నా ప్రెస్ మీట్ ప్రసారం చేయవద్దన్నారు
ప్రధాని మోడీ స్వభావమే దేశానికి పెద్ద సమస్య అని చంద్రబాబు అన్నారు. మోడీ, అమిత్ షాలు దేశాన్ని భ్రష్టు పట్టించారన్నారు. వారికి నచ్చినట్లు నియమనిబంధనలు మార్చేస్తున్నారన్నారు. నోట్ల రద్దుతో ఏం సాధించారని ప్రశ్నించారు. బీజేపీలో సహించలేనితనం పెరుగుతోందని ఆరోపించారు. ప్రశ్నిస్తే ఐటీ దాడులు చేయిస్తున్నారన్నారు. విభజనతో ఏపీ నష్టపోయిందని అంటే ఐటీ దాడులు జరిపారని ఆరోపించారు. ఢిల్లీలో ఆరు నెలల క్రితమే ఇది చూశానని, తన ప్రెస్ మీట్ ప్రసారం చేయవద్దని పీఎంవో నుంచే మీడియా సంస్థలకు సందేశం వెళ్లిందని చెప్పారు. ఆ తర్వాత మీడియా సంస్థల యాజమాన్యాలు తనకు ఫోన్ చేశారని, వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలు తెలిపారన్నారు.
అందుకే చంద్రబాబు మాతో కలిసారు
కార్పొరేట్ రంగం నుంచి బీజేపీకే ఎన్నికల నిధులు వస్తున్నాయని, ఇది సరైనది కాదన్నారు. మీరు నిధులు వసూలు చేసుకునేందుకు వారిని బెదిరిస్తారా, డిజిటల్ కరెన్సీ అని నేను సిఫార్సు చేశానే తప్ప రూ.2వేల నోట్లను తెమ్మని చెప్పలేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని అశోక్ గెహ్లాట్ అన్నారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్నారు. నోట్ల రద్దుతో అనుకున్నవీ ఏవీ జరగలేదన్నారు. నోట్ల రద్దుతోనే రెవెన్యూ పెరిగితే మున్ముందు కూడా ఇలాగే చేస్తారా అని ఎద్దేవా చేశారు. దేశంలో పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోందని, అందుకే చంద్రబాబు తొలిసారి తమతో కలిసి ఒకే వేదిక పైకి రావాలనుకున్నారని గెహ్లాట్ చెప్పారు.