టీ మంత్రులకు ఓయు విద్యార్థుల షాక్, హరీష్ అసహనం
హైదరాబాద్: తెలంగాణ మంత్రులకు ఆదివారం విద్యార్థులు షాకిచ్చారు! పాతబస్తీలోని సిటీ కాలేజీలో ఆదివారం జరిగిన అధ్యాపకుల ఫోరం ఆవిర్భావ సదస్సులో గందగోళం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్వర్లను తెలంగాణ విద్యార్థులు అడ్డుకుని నిలదీసి అడ్డుకున్నారు. పోలీసులు సక్రమంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టకపోవటంతో మంత్రులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధ్యాపకుల ఫోరం ఆవిర్భావ సభకు హాజరయ్యేందుకు మంత్రులు ఆదివారం సాయంత్రం సిటీ కాలేజీ ఆవరణకు చేరుకున్నారు. ముందుగానే సమాచారం తెల్సుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ విద్యార్థులు అడ్డుకుని నిలదీశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఔట్సోర్సు ప్రాతిపదికన పని చేస్తున్న లెక్చరర్లను పర్మినెంటు చేస్తే తమ జీవితాలు ఏం కావాలంటూ విద్యార్థులు ప్రశ్నించారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రులను అడ్డుకున్న విద్యార్థులను ఇద్దరు మంత్రుల వ్యక్తిగత సిబ్బందే అదుపు చేసింది.
మంత్రులు సభకు హాజరువుతున్నారన్న సమాచారం తెల్సుకున్న విద్యార్థులు సరిగ్గా ఆయన వచ్చే సమయానికి అక్కడ గుమిగూడి తెలంగాణ నినాదాలు చేయటం పట్ల మంత్రులు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. తాము వస్తున్నా, ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేపట్టకపోవటంపై హరీశ్ రావు వెంటనే నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డికి, అలాగే కొందరు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేయటంతో స్పెషల్ బ్రాంచి డిసిపి, ఏసిపిలు అక్కడకు చేరుకున్నారు.