ఫొటో: రేణుకా చౌదరితో ఉస్మానియా విద్యార్థులు
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు సోమవారం ఎఐసిసి అధికార ప్రతినిధి, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిని కలిశారు. తెలంగాణ సంస్కృతితో ముడిపడి ఉన్న భద్రచలాన్ని విడిపోకుండా తన వంతు కృషి చేస్తానని ఆమె ఓయు విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఓయు విద్యార్థి జెఎసి నాయకులు రేణుకా చౌదరిని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని విద్యార్థులు నినదించారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్నవారిపై భౌతిక దాడులకు దిగడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. భద్రాచలం దేవస్థానంతో తమకున్న అనుబంధం గురించి విద్యార్థులకు రేణుకా చౌదరి గుర్తు చేశారు.
భద్రాచలం సీమాంధ్రలోకి వెళ్లే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే తాను కేంద్రంలోని పెద్దలతో ఫోనులో మాట్లాడానని ఆమె చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, దాని జాతీయ హోదాకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చూడాలో ఆలోచిస్తామని రేణుకా చౌదరి చెప్పారు.
భద్రచలాన్ని సీమాంధ్రలో కలపాలని ఆ ప్రాంత నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాజకీయ నాయకులు మాత్రం దాన్ని తమ రాష్ట్రంలోనే ఉంచాలని కోరుతున్నారు. రేణుకా చౌదరి సీమాంధ్రకు చెందినప్పటికీ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చాలా కాలంగా క్రియాశీలకంగా ఉన్నారు. ఆమె ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కూడా.