చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్ తన్ని, తరిమేస్తాడేమో..!!
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గానీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గానీ ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఎవరితోనూ కలవరని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. అమిత్ షాను కలవడం వెనుక జూనియర్ ఎన్టీఆర్కు కూడా ఏవైనా ప్రయోజనాలు ఉన్నాయా? లేవా? అనేది తనకు తెలియదని పేర్కొన్నారు. 2009లోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించాడని గుర్తు చేశారు. తాత నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశాడని అన్నారు.

జూనియర్కు రాజకీయాలంటే ఆసక్తి..
ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని కొడాలి నాని స్పష్టం చేశారు. ఆ ఆసక్తితోనే తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశాడని అన్నారు. ఆ ఇంట్రస్ట్ లేకపోతే ఎందుకు చేస్తాడని ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుందనేది తాను చెప్పలేనని స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరుతాడనేది ఎలా చెప్పగలనని అన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరుతాడా? లేక పార్టీలో ఇప్పుడున్న వాళ్లని తన్ని, తరిమేసి తాత పెట్టిన తెలుగుదేశాన్ని హ్యాండోవర్ చేసుకుంటాడా అనేది తెలియదని తేల్చేశారు.

వివరాలు తెలియవు..
అమిత్ షా తన మనస్సులో ఒకటి అనుకుని ఎన్టీఆర్ను కలిసి ఉండొచ్చని, ఆ ప్రతిపాదనలను ఆయన ముందు పెట్టి ఉంటాడని తాను అనుకుంటున్నట్లు కొడాలి నాని అన్నారు. అమిత్ షా వద్దకు వెళ్లే సమయంలో ఎన్టీఆర్ కూడా ఏదో ఒక ఆలోచనతోనే వెళ్లి ఉంటాడని ఆయన వ్యాఖ్యానించారు. వారిద్దరూ అభిప్రాయాలను పంచుకుని ఉంటారని, వాటి గురించి పూర్తి వివరాలు తనకు తెలియవని కొడాలి నాని పేర్కొన్నారు.

స్నేహం వేరు రాజకీయం వేరు
అమిత్ షా చెప్పినవన్నీ జూనియర్ ఎన్టీఆర్ ఆచరిస్తాడని అనుకోవడానికి వీల్లేదని కొడాలి నాని అన్నారు. పోనీ- ఎన్టీఆర్ అడిగినవన్నీ కూడా అమిత్ షా చెయ్యలేకపోవచ్చనీ చెప్పారు. అమిత్ షాను కలిసిన తరువాత తాను జూనియర్తో మాట్లాడలేదని, తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతుదారుడినని గుర్తు చేశారు. ఎన్టీఆర్ తనకు స్నేహితుడే అయినప్పటికీ.. స్నేహం వేరు- రాజకీయం వేరు అని స్పష్టం చేశారు.

టీడీపీలో ఎన్టీఆర్ చేరినా..
తెలుగుదేశం పార్టీ నుంచి తాను బయటికి వచ్చిన తరువాత ఎన్టీఆర్తో అప్పుడప్పుడూ మాట్లాడానే తప్ప ఆయనను కలవలేదని కొడాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వస్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ను తొలగించి ఆ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ను కూర్చోబెట్టినా తమపై పెద్దగా ప్రభావం చూపబోదని పేర్కొన్నారు. తమ ఓటు బ్యాంక్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

60 శాతానికి ఓటు బ్యాంక్..
2019 నాటి ఎన్నికల్లో తమకు 50 శాతం ఓట్లు పోల్ అయ్యాయని, ఈ సారి ఈ సంఖ్య 55 నుంచి 60కి చేరుతుందని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఏపీలో రెండుశాతం మాత్రమే ఓటింగ్ ఉందని పేర్కొన్నారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరితే ఆ పార్టీకి వచ్చే ఓట్ల శాతం పెరగుతుందని చెప్పారు. ఎన్టీఆర్ చేరిక వల్ల అదనంగా ఓట్ల శాతం పెరిగితే బీజేపీ బలపడినట్టే అవుతుందని కొడాలి నాని విశ్లేషించారు.

చంద్రబాబు ఏక్నాథ్ షిండే..
తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు వెళ్లిపోయి.. జూనియర్ ఎన్టీఆర్ రావడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని కుండబద్దలు కొట్టారు. తమ ఓటుబ్యాంక్, తమ క్యాడర్ చెదిరిపోదని స్పష్టం చేశారు. అలాంటి ఇబ్బంది ఏదైనా వస్తే అది టీడీపీకేనని కొడాలి నాని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఇప్పుడు పుట్టుకొచ్చాడని, ఆ పని చంద్రబాబు ఎప్పుడో చేశాడని చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications