ప్రధానిగా.. బీహార్కు మోడీ షాకింగ్ ప్యాకేజీ: బాబుకేం చెబుతారు?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ బీహార్ రాష్ట్రానికి భారీ ప్యాకేజీని ప్రకటించారు. రూ.1.25 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని, దాంతో పాటు మరో రూ.40వేల కోట్లు ప్రాజెక్టులకు ఖర్చు పెడతామని బీహారీలకు హామీ ఇచ్చారు.
బీహార్కు భారీ ప్యాకేజీ ఇచ్చిన ప్రధాని మోడీ... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేస్తారు? ప్రత్యేక హోదా కోసం అడుగుతున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఏం సమాధానం చెబుతారు? అనే ప్రశ్న చర్చకు వస్తోంది.
బీహార్కు ప్యాకేజీ, ప్రాజెక్టుల కోసం ఖర్చు అని చెబుతూ.. మొత్తం రూ.1.65 కోట్ల ప్యాకేజీని ప్రధాని మోడీ ప్రకటించారు. ఇంత మొత్తం కేంద్రం ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ప్యాకేజీని ప్రకటించారనేది సుస్పష్టం.
ప్రధానిగా ఇచ్చిన హామీలు...
అయితే, ప్రధాని హోదాలో మోడీ ఇచ్చిన ఈ 'భారీ' హామీని నెరవేర్చుకుంటారా? అంత సాయం సాధ్యమైనా? అనే చర్చ సాగుతోంది. ప్రధాని హోదాలో ఇచ్చిన హామీని నెరవేర్చక తప్పని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.
బీహార్ విషయాన్ని పక్కన పెడితే, ఏపీకి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని కూడా గుర్తు చేస్తున్నారు. ప్రధాని హోదాలో మోడీ బీహార్కు ఇచ్చిన హామీని నెరవేర్చగలిగినప్పుడు.. అదే ప్రధాని హోదాలో నాటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాల్సిందేనని చెబుతున్నారు.
బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ వేరు, ఏపీకి ప్రత్యేక హోదా వేరు అయినప్పటికీ... దానిని నెరవేర్చాల్సిందేనని చెబుతున్నారు. బీహార్ అన్ని రకాలుగా వెనుకబడిన రాష్ట్రం కాబట్టి దానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంలో తప్పులేదని, అదేవిధంగా విభజనతో నష్టపోయిన ఏపీకిచ్చిన మాటను కూడా నిలబెట్టుకోవాలంటున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వేర్వేరుగా అధికార టిడిపి, విపక్షాలైన వైసిపి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలు ఒకే తాటి పైన ఉన్నాయి. ప్రత్యేక హోదా కావాల్సిందేనని చెబుతున్నాయి. సిఎం చంద్రబాబు ఈ నెల 20వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.
ఆ సమయంలో విభజన హామీలు.. ప్రధానంగా ప్రత్యేక హోదా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. బీహార్కు భారీ ప్యాకేజీ దృష్ట్యా ప్రత్యేక హోదా పైన చంద్రబాబుకు లేదా ఏపీకి ప్రధాని మోడీ ఏం సమాధానం చెబుతారనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిరేపుతున్న విషయం.
విభజన అనంతరం ఏపీ లోటు బడ్జెట్లో ఉంది. రాజధాని లేదు. కొత్త ప్రభుత్వ కార్యాలయాలు, కొత్త రాజధానిని నిర్మించుకోవాలి. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రధాని మోడీ ఏం సాయం చేస్తారనేది బీహార్ ఎన్నికల అనంతరమే తేలుతుందని చెబుతున్నారు.
బీహార్కు ఇచ్చిన భారీ హామీని ప్రధాని మోడీ నేరవేర్చకుంటే అది మోడీ ప్రతిష్టకు, బీజేపీకి నష్టమని, అదే సమయంలో ఆ హామీని నెరవేర్చుకుంటే ఏపీకి నాటి ప్రధాని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాల్సిందేనని చెబుతున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని బీజేపీ నేతలు చెబుతోన్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా పేరు లేకపోయినప్పటికీ దానికి మించి సాయం చేస్తామని చెబుతున్నారు. హోదా అయినా ప్యాకేజీ అయినా ఏపీకీ మేలు జరగాలని చాలామంది చెబుతున్నారు.