కరోనా పేషెంట్ల కోసం టీటీడీ భారీ స్కీం: పద్మావతి ఆసుపత్రిలో..యుద్ధ ప్రాతిపదికన: కొత్త తరహా మాస్కులు
తిరుపతి: కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు అందించే వైద్య చికిత్స కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తిరుపతిలోని శ్రీ పద్మావతి వైద్య కళాశాల ఆసుపత్రి సామర్థ్యాన్ని పెంచబోతోంది. కొత్తగా 500 పడకలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేపట్టింది. 48 గంటల వ్యవధిలో యుద్ధ ప్రాతిపదికన 500 పడకలను అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనితో పాటు పెద్ద ఎత్తున వెంటిలేటర్లను తెప్పించబోతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
పద్మావతి వైద్య కళాశాల, ఆసుపత్రిని ప్రత్యేకంగా కరోనా పేషెంట్ల కోసం మార్పు చేశారు. దీన్ని తాత్కాలికంగా కోవిడ్ ఆసుపత్రిగా కిందటి నెలలోనే మార్పులు చేశారు. శుక్రవారం ఉదయం ఆయన ఆసుపత్రిని సందర్శించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాతో కలిసి పర్యటించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఆసుపత్రిలో రెండు రోజుల్లో వెంటిలేటర్లతో సహా మొత్తం 500 బెడ్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. వెంటిలేటర్లు, సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్ల కొరత రాకుండా చూడాలని అన్నారు.
కోవిడ్-19 ప్రత్యేక ఆసుపత్రి తిరుపతి సిమ్స్ పద్మావతి హాస్పిటల్ లో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్యటన. కరోనా చికిత్సకు సంబంధించిన సహాయక చర్యలను పరిశీలించిన TTD ఛైర్మన్. ప్రస్తుతం ఉన్న 200 పడకల సామర్థ్యాన్ని 500 పడకలకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన.#TTD pic.twitter.com/xsZLZ5kqGK
— YSR Congress Party (@YSRCParty) April 17, 2020
జిల్లాలో కరోనా వైరస్ పేషెంట్ల కోసం ముందు జాగ్రత్త చర్యలను చేపట్టామని అన్నారు. పద్మావతి మెడికల్ కాలేజీలో వైద్య పరికరాలు, పీపీఈ కిట్లను కొనుగోలు చేయడానికి 20 కోట్ల రూపాయల మొత్తాన్ని టీటీడీ తరఫున జిల్లా కలెక్టరుకు మంజూరు చేసినట్లు తెలిపారు. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వలస కూలీలు, పేదల కోసం చేపట్టిన అన్నదానం కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అన్నారు. లాక్డౌన్ పరిస్థితులు ముగిసేంత వరకూ శ్రీవారి అన్న ప్రసాదాన్ని సరఫరా చేస్తామని చెప్పారు. తిరుపతి సహా పరిసర ప్రాంతాల్లో రోజుకు 1.40 లక్షల మందికి అన్న ప్రసాదం అందిస్తున్నామని చెప్పారు.
Recommended Video
లాక్డౌన్ కొనసాగినన్ని రోజులు తిరుమల శ్రీవారి ఆలయాన్ని భక్తుల కోసం తెరవబోమని చెప్పారు. స్వామివారికి యథావిధిగా నిత్యపూజలు, కైంకర్యాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆన్లైన్ ద్వారా స్వామి వారి సేవల టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు రీఫండ్ చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. లాక్డౌన్ ఎత్తేసిన తరువాత కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతి ఇస్తామని చెప్పారు.