జగన్! నా నోటికి పని చెప్పకు: సైకిలెక్కిన అమర్నాథ్, నెల్లూరు కీలక నేత ఝలక్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఎమ్మెల్యే షాకిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గురువారం నాడు టిడిపిలో చేరారు. ఆయన అంతకుముందు టిడిపి నేతనే. చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు.
ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. నేను డబ్బులు తీసుకొని టిడిపిలో చేరుతున్నట్లు రాసిన వార్తలకు జగనే సమాధానం చెప్పాలన్నారు. తనకు ఉన్నది ఒక్కడే బిడ్డ అని, డబ్బులు తీసుకోలేదని వాడి మీద ప్రమాణం చేసి చెబుతానని, జగన్కు ఏసుక్రీస్తు పైన నమ్మకం ఉంటే నేను డబ్బులు తీసుకున్నానని క్రీస్తు దగ్గర తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరారు.
తన పైన జగన్ సాక్షి పత్రిక అబద్దపు వార్తలు రాసిందన్నారు. సాక్షి కథనాలు సరికాదన్నారు. పత్రిక ఉంది కదా అని ఏది రాసినా చెల్లుతుందని అనుకోవద్దని హితవు పలికారు. అమర్నాథ్ రెడ్డి అంటే ఏమిటో జగన్కు బాగా తెలుసునని, తనను మరింత ఇబ్బంది పెట్టి తన నోటికి పని చెప్పవద్దని హెచ్చరించారు.
రేపో మాపో టిడిపిలోకి వైసిపి నేతవ వేమిరెడ్డి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైసిపి నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వీపీఆర్) కూడా టిడిపిలో చేరనున్నారు. నెల్లూరు జిల్లా వైసిపిలో వేమిరెడ్డి కీలక నేత. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి వారి గెలుపుకు అవసరమయ్యే నిధులు సమకూర్చే బాధ్యతను కూడా ఆయన గత ఎన్నికల్లో నెత్తిన వేసుకున్నట్లుగా చెబుతున్నారు. జగన్ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు.
అయితే, ఇప్పుడు ఆయన టిడిపిలో చేరనుండటం గమనార్హం. ఆయన కొద్ది రోజుల క్రితం వైసిపికి రాజీనామా చేశారు. సీఎం చంద్రబాబును కలిశారు. పార్టీలో చేరుతానని చెప్పగా.. చంద్రబాబు ఆహ్వానించారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ దిగలేదు. ఇప్పుడు ఆయన ఎట్టకేలకు టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.