వైయస్పై పల్లె సంచలన వ్యాఖ్య: రాజధానిలో వైసిపి 'కొనుగోలు'పై టిడిపి ఆరా
అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం నాడు వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ, కాపు నేత ముద్రగడ పద్మనాభంలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్నారు.
జగన్ విసిరే అస్త్రాలకు ఎవరూ పావులు కావొద్దని పల్లె అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని జగన్ చూస్తున్నారన్నారు. అందుకోసం ముద్రగడ, మందకృష్ణలను ఉపయోగించుకుంటున్నారన్నారు. గతంలో పాతబస్తీలో మతాల మధ్య చిచ్చు పెట్టిన ఘనత వైయస్ రాజశేఖర రెడ్డిది అని ధ్వజమెత్తారు.
వైసిపి తప్పుడు ఆరోపణలు: గద్దె
తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకుల పైన తప్పుడు ఆరోపణలు చేసి లబ్ధి పొందేందుకు వైసిపి ప్రయత్నాలు చేస్తోందని తూర్పు శాసన సభ్యుడుగద్దె రామ్మోహన్ అన్నారు.
గురువారం 11వ డివిజన్లో పార్టీ కార్యకర్త సుశీలకు రూ.15 వేల విలువ చేసే సోడా, డ్రింక్స్ అమ్ముకునే బండిని గద్దె తన సొంత నిధులతో అందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సాక్షి పేపర్, చానల్లు తప్పుడు రాతలు రాస్తూ గ్లోబెల్ ప్రచారానికి దిగుతున్నాయని ధ్వజమెత్తారు.
వైసిపి నేతల భూములపై టిడిపి నేతల ఆరా
తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రుల భూముల పైన వైసిపి నేతలు, జగన్ పత్రిక సాక్షి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు కౌంటర్ దాడికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో వైసిపి నేతలు కొన్న భూముల పైన కూపీ లాగుతున్నారు.