రాక్షసుల్లా..: జగన్ను ఏకేసిన పల్లె, కెఇ కృష్ణమూర్తి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూసేకరణపై ఫిర్యాదు చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, కెఈ కృష్ణమూర్తి వేర్వేరుగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎపి రాజధాని నిర్మాణానికి వైయస్ జగన్, వైసిపి నాయకులు రాక్షుల్లా అవరోధం కల్పిస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి విరుచుకుపడ్డారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు.
వైయస్ జగన్కు అభివృద్ధి ఇష్టం లేదని ఆయన అన్నారు. వేయి ఎలుకలను తిన్న పిల్లి మాంసాహారం మానాలని చెప్పినట్లు వైయస్ జగన్, ధర్మాన మాటలు ఉన్నాయని ఆయన అన్నారు. అవినీతిలో వైయస్ జగన్ అనకొండ అని ఆయన అన్నారు. రైతులపై జగన్ ప్రేమ నటించడం ఈ దశాబ్దం జోక్ అని వ్యాఖ్యానించారు. రాజధాని వస్తుందని ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే జగన్ పార్టీవాళ్లు పంటలను కాల్చేశారని ఆయన ఆరోపించారు.

ఎపి రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడం లేదని ఆయన స్పష్టం చేశారు రైతులను భయబ్రాంతులకు గురి చేయడం లేదని చెప్పారు. భూములు ఇచ్చేవారి నుంచే తీసుకుంటామని ఆయన చెప్పారు. గవర్నర్ను కలిసినవారిలో రైతులు లేరని, వైసిపి కొంత మందిని రెచ్చగొడుతోందని ఆయన అన్నారు.
వైయస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి విరుచుకుపడ్డారు. గుంటూరులో కాకుండా ఇడుపులపాయలో రాజధానిని ఏర్పాటు చేస్తే సరేనా అని ఆయన జగన్మనోహన్ రెడ్డిని ప్రశ్నించారు. రెండేళ్లలో చంద్రబాబు పాలన కూలడం కాదు, జగన్ జైలుకు వెళ్తారని ఆయన అన్నారు. తాను ఎప్పుడు జైలుకు వెళ్తాననే విషయంపై జగన్ జ్యోతిష్కులను అడిగితే బాగుండేదని ఆయన అన్నారు.
నవ్యాంధ్ర రాజధానిని అడవుల్లో పెట్టలేదనే విపక్షనేత జగన్ భూ సమీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆరోపించారు. ఎమ్మెల్యే ఇటీవల రాజధాని ప్రాంతంలో పంటలను తగులబెట్టిన వారిని రక్షించాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేత జగన్ భూ సమీకరణపై ఇంతగా హడావిడి చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications