ప్రేమించిన పాపానికి.. నిద్రలోనే నిశ్శబ్ద హత్య
ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అనుకున్నారు.. అల్లారుముద్దుగా పెంచారు. మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు. కానీ, తను మనసు పడ్డ వాడిని పెళ్లి చేసుకుందన్న 'కోపం'.. ఆ తండ్రిలోని మమకారాన్ని చంపేసింది. సమాజంలో తన పరువు పోయిందన్న అహంకారం, కన్నకూతురినే కాటికి పంపేలా చేసింది. మాచర్లలో గత నెల 18న జరిగిన చౌడేశ్వరి (22) మృతి కేసులో అసలు నిజం విచారణలో బయటపడింది. అది ఆత్మహత్య కాదు.. తండ్రే పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య అని తేలింది.
మాచర్లకు చెందిన వ్యాపారి చంద్రశీను కుమార్తె చౌడేశ్వరి, పొరుగు ఇంటికి వచ్చే నాగరాజు అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే, తండ్రి మాత్రం ఆమెను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు. మరికొద్ది రోజుల్లో నిశ్చితార్థం అనగా, చౌడేశ్వరి తన ప్రేమికుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. ఈ పరిణామం చంద్రశీనుకు అస్సలు నచ్చలేదు. అప్పటి నుండి ఆమెపై కక్ష పెంచుకున్నారు.

పోలీస్ స్టేషన్ ఒప్పందమే శాపమైంది!
కుమార్తె వెళ్ళిపోయిన తర్వాత, ఇంట్లో బంగారం పోయిందని చంద్రశీను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ మలుపు తిరిగింది. పోలీసులు నూతన దంపతులను పిలిపించి విచారించగా, తానేమీ తీసుకెళ్లలేదని చౌడేశ్వరి స్పష్టం చేసింది. అయితే, పెద్దల మధ్య జరిగిన చర్చల అనంతరం.. ఐదు రోజుల పాటు పుట్టింట్లో ఉండి, ఆ తర్వాత భర్త దగ్గరకు వెళ్లేలా ఒప్పందం కుదిరింది. మార్చి 19న ఆమె తిరిగి భర్త వద్దకు వెళ్లాల్సి ఉండగా, అంతకంటే ఒక్కరోజు ముందే (మార్చి 18న) విగతజీవిగా మారింది.
దిండుతో అదిమి.. ప్రాణం తీసి...
పక్కా పథకం ప్రకారమే చంద్రశీను ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మార్చి 18న తన భార్య, కుమారుడిని బలవంతంగా పొలానికి పంపించారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, తన మేనల్లుడు పచ్చిపాల శీనుతో కలిసి నిద్రిస్తున్న చౌడేశ్వరిపై దాడి చేశారు. ఆమె ముఖంపై దిండును గట్టిగా అదిమి పెట్టి ఊపిరి ఆరకుండా చేసి చంపేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, ఆ తర్వాత ఆమె ఉరేసుకున్నట్లు చిత్రీకరించారు.
నిజం ఒప్పుకున్న నిందితుడు..
పోస్టుమార్టం నివేదికలో ఆమెది ఆత్మహత్య కాదని, గొంతు నులమడం వల్లే మరణించిందని తేలడంతో పోలీసులు చంద్రశీనును తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆయన అసలు నిజం కక్కేశారు. "ఆస్తిపరుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే, ప్రేమ పెళ్లి చేసుకుని నా పరువు తీసింది.. అందుకే చంపేశాను" అని నిందితుడు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లా అదనపు ఎస్పీ సంతోష్ ఆధ్వర్యంలో నిందితులను విచారిస్తున్నారు. కన్నకూతురిని పరువు కోసం బలితీసుకున్న ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.












Click it and Unblock the Notifications