ఎవరి పని?: టీడీపీలో 'కరపత్రం' అలజడి, అవినీతి లెక్కల్ని బయటపెడుతూ..
గుర్తు తెలియని వ్యక్తులు ప్రచురించిన ఆ కరపత్రం టీడీపీ క్యాంపులో అలజడి రేపింది.
Recommended Video

ఏలూరు: ఏలూరు టీడీపీలో ఓ కరపత్రం దుమారం రేపింది. సంక్షేమ, అభివృద్ది పథకాల్లో టీడీపీ అక్రమాలను, అవినీతిని ఆ కరపత్రం బయటపెట్టింది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రచురించిన ఆ కరపత్రం టీడీపీ క్యాంపులో అలజడి రేపింది. దీంతో దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు.
దొంగచాటుగా కరపత్రాలు పంచడం కాదని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని చింతమనేని సవాల్ చేశారు. ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలో ఈ కరపత్రాలు వెలుగుచూశాయి. ఇంటింటికి టీడీపీ కార్యక్రమం సందర్భంగా స్థానిక కార్యకర్తలు తమ ఎమ్మెల్యేకు ఈ కరపత్రాలను చూపించారు.
గ్రామంలోని సుమారు 450 ఎకరాల చెరువులో అక్రమంగా చేపల సాగు చేస్తూ టీడీపీ నాయకులు దొంగచాటుగా లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారని కరపత్రంలో పేర్కొనడం గమనార్హం.

పాత మరుగుదొడ్లకు సున్నం కొట్టడం, ఒకే ఇంట్లో రెండు లేదా మూడు దొడ్లు నిర్మించామని తప్పుడు లెక్కలు చెబుతూ లక్షల రూపాయాలు కాజేశారని అందులో ఆరోపించారు. అలాగే ఉపాధిహామీ పథకం పనుల్లో తప్పుడు మస్టర్లు వేసి టీడీపీ నాయకులు ఎన్ఆర్ఈజీఎస్ నిధులను కూడా దారి మళ్లించారని పేర్కొన్నారు.
రూ.1.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. కరపత్రం చివరలో 'ప్రజాస్వామ్యంలో బాధ్యత కల్గిన పౌరుడిగా' దీన్ని పంపిణీ చేస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చింతమనేని దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. ఏలూరులో ఇప్పుడీ కరపత్రాలపై జోరుగా చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications